Indian professors in Abroad: మనదేశానికి చెందిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విషయం తెలిసిందే. అలాగే పలు బహుళజాతి సంస్థల నిర్వహణలోనూ మనవారు కీలకస్థానాల్లో ఉన్న సంగతీ విదితమే. మరి దేశానికే చెందిన అనేక మంది ప్రవాసులు పలు దేశాల్లో పెద్దఎత్తున ఆచార్యులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలుసా?..ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి పలు దేశాలు ప్రవాసభారతీయులు/ప్రవాసాంధ్రులకు ఆచార్యులుగా పట్టం కడుతున్నాయి. అంతేకాదు పరిపాలనా వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాయి. తాజాగా తెలుగు మహిళ నీలి బెండపూడి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి తొలి మహిళా ప్రెసిడెంట్గా నియమితులు కావడం గమనార్హం.
భారత్ నుంచి విద్యార్థులు 1980 ప్రాంతంలో అమెరికాతోపాటు యూరప్ దేశాల్లో ఇంజినీరింగ్, పీహెచ్డీ చేసేందుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అలాంటి వారు ఎంతో మంది అక్కడే బోధనా వృత్తి వైపు ఆసక్తి చూపారు. 990 వరకు అదే పరిస్థితి కొనసాగింది. అలా ఆచార్యవృత్తిలో రాణిస్తున్నవారిని ఆయా వర్సిటీలు ముఖ్యమైన స్థానాల్లో నియమిస్తూ మనవారికి సముచిత స్థానాలు కట్టబెడుతున్నాయి. ఇలా ఎంతో మంది ప్రవాస భారతీయులు(ప్రవాసాంధ్రులు/ప్రవాస తెలంగాణీయులు) మంచి హోదాల్లో నిలుస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి విశ్లేషించారు.
అమెరికాలో 2010లోనే దాదాపు 300-400 మంది తెలుగు ఆచార్యులు పలు వర్సిటీల్లో వివిధ హోదాల్లో ఉన్నట్లు అంచనా వేశారు. వారు ఆచార్యులుగా, విభాగాధిపతులుగా, డీన్లుగా, ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగి ఉంటుందని అంచనా. తాజాగా వైజాగ్కు చెందిన నీలి బెండపూడి పెన్సిల్వేనియా రాష్ట్ర వర్సిటీ ప్రెసిడెంట్గా తాజాగా నియమితులయ్యారు.
ఓయూలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన జేఎన్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒకటైన టెక్సాస్ ఏ అండ్ ఎంలోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ మెకానిక్స్ ఫర్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇంద్రా కె.రెడ్డి టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీలోని ఫార్మసీ కళాశాల వ్యవస్థాపక డీన్గా ఉన్నారు. కాకతీయ వర్సిటీలో ఆయన బీఫార్మసీ చదివారు.
* అమెరికాలో ఇంజినీరింగ్ విద్యకు అత్యంత ప్రసిద్ధి చెందిన కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన సుబ్ర సురేష్ 2013లో ఎన్నికయ్యారు. ఆసియా దేశాలకు చెంది ఎంఐటీ డీన్గా పనిచేసిన మొదటి వ్యక్తి ఆయనే. బ్రౌన్ వర్సిటీలో అత్యంత చిన్న వయసులో ఆచార్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు కూడా ఆయనే.
* ప్రవాస భారతీయుడైన ప్రదీప్ ఖోస్లా కాలిఫోర్నియా వర్సిటీ ఛాన్స్లర్గా పనిచేయడం విశేషం.
* యూకేలోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అమర్త్యసేన్, సుగతా మిత్ర, కుమార్ భట్టాచార్య, సుమంత్ర బోస్ తదితరులు, కేంబ్రిడ్డి వర్సిటీలో జైదీప్ ప్రభు తదితరులు పనిచేశారు.
* ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, యూనివర్సిటీ కాలేజ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్, మాంచెస్టర్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ తదితర ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో పదుల సంఖ్యలో భారతీయులు గురువులుగా వ్యవహరిస్తున్నారు.
* కొలంబియా విశ్వవిద్యాలయంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2011లో విడుదల చేసిన సర్వే ప్రకారం 5.4 శాతం ఆసియన్లు బోధనా వృత్తిలో ఉంటే వారిలో 2-3 శాతం శాతం మంది భారతీయులే ఉంటారని అంచనా వేశారు.