ts bpass : భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి తెలంగాణ పురపాలక శాఖ అమలుచేస్తున్న టీఎస్బీపాస్ను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. పరిశ్రమల అనుమతుల కోసం అమలవుతున్న టీఎస్ఐపాస్ దేశానికి ఆదర్శమైందని, ఇదే తరహాలోనే భవన నిర్మాణ అనుమతుల్లో టీఎస్బీపాస్ను ఆదర్శ వ్యవస్థగా మార్చాలని అధికారులకు సూచించారు. ఈ విధానాన్ని ప్రజలు ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, అనుమతుల జారీలో గతంలో ఉన్న ఆలస్యం తగ్గిందన్నారు. దీన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి వెబ్సైట్లో ఎప్పటికప్పుడు మార్పులు చేయాలని, ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని బలోపేతం చేసేలా టోల్ఫ్రీ నంబరుకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలిచ్చారు. సోమవారం ప్రగతిభవన్లో టీఎస్బీపాస్ క్షేత్రస్థాయిలో అమలు సహా పురపాలకశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, పురపాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణతోపాటు జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘‘పట్టణాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. పట్టణ ప్రగతి ద్వారా ప్రతినెలా పురపాలికలకు నిధులు అందుతున్నాయి. దీంతోపాటు మౌలికసదుపాయాల కల్పనకు టీయూఎఫ్ఐడీసీ ద్వారానూ నిధులను అందజేస్తోంది’ అని కేటీఆర్ తెలిపారు.
కొత్త పురపాలికలకు మాస్టర్ప్లాన్లు