Warehouse Corporation Chairman Saichand passed away : తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వేద సాయిచంద్ హఠాన్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని వ్యవసాయక్షేత్రానికి వెళ్లిన ఆయన బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులునాగర్కర్నూల్లోని ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవటంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సాయిచంద్ మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. భౌతికకాయాన్ని హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోని నివాసానికి తరలించారు. సాయిచంద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న వేద వెంకటరాములు, మణెమ్మ దంపతులకు జన్మించిన సాయిచంద్.. ఎన్నో కష్టాలకోర్చి హైదరాబాద్లో పీజీ వరకు చదువుకున్నారు. పీడీఎస్యూలో ఉంటూ అరుణోదయ కళాకారుడుగా పనిచేశాడు.
- రాతిబొమ్మలను తన పాటతో కదిలించిన.. సాయిచంద్ గురించి ఈ విషయాలు తెలుసా..?
- KTR Emotional Video : ఎమోషనల్ అయిన కేటీఆర్.. సాయిచంద్ను తలుచుకుంటూ కంటతడి
Saichand last rites : ఈ క్రమంలోనే మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించి తన ఆటాపాటలతో ఉర్రూతలూగించే వారు. ఉద్యమ సమయంలో అనేక సభల్లో పాల్గొన్న సాయిచంద్ తన కళాప్రదర్శనలతో ఆనాటి ఉద్యమనేతలను ఆకర్షించటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉద్యమకాలం నుంచి నేటి వరకు సాయిచంద్ ఆటాపాట లేని కేసీఆర్ సభ దాదాపుగా ఉండదంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ పోరాటంలో ఉద్యమస్ఫూర్తిని రగిలించటమే కాకుండా స్వరాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలను ఆటాపాటలతో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతో కృషి చేశాడు.