రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. అమ్మకం పన్ను, జీఎస్టీ ద్వారానే తెలంగాణకు అత్యధిక పన్ను రాబడి సమకూరుతుండగా... మొదటిసారి ఈ ఆదాయాల్లో తక్కువ వృద్ధిరేటు నమోదైంది. రాష్ట్రంలో పటిష్ఠమైన పన్ను వసూళ్ల విధానాలతో 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకూ పన్నుల రాబడిలో సగటున 16 శాతం వృద్ధి రేటు ఉంది. 2017-18లో గరిష్ఠంగా 19 శాతం మేర పన్నుల రాబడి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం ఉన్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అంచనాలను అందుకోలేకపోయింది.
పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి గతంలో కంటే తగ్గగా జీఎస్టీ రాబడుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంది. రాష్ట్రాల్లో నిర్దేశించిన మేర జీఎస్టీ రాబడులు రాకుంటే, కేంద్రం పరిహారం ఇచ్చే నిబంధన ఉండటంతో తెలంగాణ రాష్ట్రం పరిహారం తీసుకుంది. ఆరంభంలో మినహా గత ఏడాది వరకూ ఎలాంటి పరిహారం తీసుకోని రాష్ట్రం ఇటీవల రూ.1900 కోట్ల పరిహారం అందుకుంది.