తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బండి... నష్టాలు దండి - ఆర్టీసీ నష్టాలు

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఆర్టీసీ పరిస్థితి. నష్టాల నుంచి తేరుకుంటున్న సమయంలోనే లాక్​డౌన్​ ఆర్టీసీకి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.660 కోట్ల ఆదాయం కోల్పోయింది. 55 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినా... పూర్తి స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించడంలేదు. ఆక్యుపెన్సీ రేషియో(ఓ.ఆర్) 40 శాతం దాటడంలేదు. ఆర్టీసీ తిరిగి గాడిన పడాలంటే... ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Telangana rtc latest news
Telangana rtc latest news

By

Published : Jun 3, 2020, 6:48 PM IST

రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ. ఆర్టీసీ సమ్మె అనంతరం తిరిగి ప్రక్షాళన చేసేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత..అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పనిచేయడం ప్రారంభించారు. ఆర్టీసీ అతి కొద్దిరోజుల్లోనే నష్టాలను వీడి లాభాలబాటలో పయనిస్తుందని అంతా అనుకున్నారు. అంతలోనే ఉన్నట్టుంది కరోనా మహమ్మారి వచ్చిపడింది.

ఓ.ఆర్ 40 శాతం దాటడంలేదు...

లాక్​డౌన్​కు ముందు 9,691 (ఆర్టీసీ బస్సులు 6,553... 3,138 అద్దె బస్సులు)ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 81 లక్షల 28వేల పైచిలుకు మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేసేవారు. ఓ.ఆర్ 70 శాతంకి పైగా వచ్చేది. అతికొద్దిరోజుల్లోనే ఆర్టీసీకి తిరిగి మంచి రోజులు వస్తాయని అందరూ అనుకున్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో 55 రోజుల పాటు ఆర్టీసీ బస్సులు కేవలం డిపోలకే పరిమితమయ్యాయి. సరిగ్గా మే 18వ తేదీ నుంచి తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. కానీ..అంతకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభమైన తర్వాత ఓ.ఆర్ కేవలం 28 శాతమే మాత్రమే నమోదైంది.

మాస్క్​లు ధరిస్తేనే అనుమతి...

బస్సులను శానిటైజేషన్ చేసే పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే మాస్క్​లు ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా 40 శాతం ఓ.ఆర్​కు కూడా చేరుకోలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 5వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. 1,200 పైచిలుకు అంతరాష్ట్ర , 3,500 పైగా ఉన్న గ్రేటర్ ఆర్టీసీ బస్సులు ఇప్పటికీ రోడ్డెక్కలేదు. నడుస్తున్న ఐదువేల బస్సులకు వస్తున్న ఆదాయం డీజీల్​, బస్సుల మెయింటనెన్స్​కు మాత్రమే సరిపోతుందని ఒకరిద్దరు ఉన్నతాధికారులు వాపోతున్నారు.

సిబ్బందికి 50 శాతం జీతాలే...

ఆర్టీసీకి ప్రతిరోజూ సుమారు రూ.12 కోట్ల ఆదాయం సమకూరేది. 55 రోజులుగా ఆర్టీసీ నడవకపోవడం వల్ల రూ.660 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులకు, డ్రైవర్లకు, కండక్టర్లకు కేవలం 50శాతం జీతాలనే ఇస్తున్నారు. నాల్గవ తరగతి ఉద్యోగులకు, పొరుగు సేవల సిబ్బందికి 90శాతం జీతాలు అందజేస్తున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.

మంత్రి అజయ్​ కుమార్​ సమీక్ష...

అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చినా... తెలంగాణలో అంతర్ రాష్ట్ర బస్సులు ఇంకా రోడ్డెక్కలేదు. ఒకవేళ రోడ్డెక్కితే ఎటువంటి నిబంధనలు పాటించాలనే అంశంపై ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ, ఈడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సరిహద్దుల్లో ఏవిధంగా వ్యవహరించాలి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు బస్సులు నడపాలంటే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలనే అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చాయి.

ఈనెల 8 తర్వాత గ్రేటర్​తో పాటు, అంతర్ రాష్ట్ర సర్వీసులను నడిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే..గ్రేటర్​లో నడిపించే బస్సుల్లో ఎంతమంది ప్రయాణికులను అనుమతించాలనే అంశంపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఇప్పటికైనా తిరిగి ఆర్టీసీని గాడిన పెట్టాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కొవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ...ఓ.ఆర్​ శాతం పెంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనా..తిరిగి ఆర్టీసీ పూర్వస్థితికి చేరుకోవాలంటే మరిన్ని నెలలు పడుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details