భూముల క్రయవిక్రయాలపై ఎన్నికల ఎఫెక్ట్ - రాష్ట్రంలో తగ్గిన రిజిస్ట్రేషన్ల రాబడి - Telangana Stamps Registration Department
Telangana Registrations Income Decreased : రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలపై ఎన్నికల ప్రభావం పడింది. తద్వారా రిజిస్ట్రేషన్ల రాబడి మందగించింది. మూడు నెలలుగా సాగు భూముల కొనుగోళ్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన దృష్ట్యా డిసెంబర్ నుంచి మార్చి వరకు తిరిగి రాబడులు జోరందుకుంటాయని భావిస్తున్నారు.
Telangana Registrations Income Decreased : తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి (TelanganaStamps and Registrations Revenue) తగ్గింది. కొన్ని నెలలుగా భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం కాస్త మందగించింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగానే భూముల కొనుగోళ్లు నిలిచిపోయాయని నిపుణులు చెబుతున్నారు. గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అనుకున్నంత మేర రాబడి రాలేదు.
Telangana Stamps and Registrations Revenue Decrease : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రూ.8452.90 కోట్ల రాబడి నమోదైంది. గత ఆర్థిక ఏడాదితోఇది రూ.8355.61 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సారి ఆదాయం పర్వాలేదనిపించింది. కానీ అభివృద్ధి శాతం పరంగా చూస్తే మాత్రం ఇది స్వల్పమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
సాగు భూముల కొనుగోళ్లు తగ్గుముఖం :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections 2023) వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి సాగు భూముల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరులో రూ.10.39 కోట్లు, అక్టోబర్లో రూ.32.13 కోట్లు, నవంబర్లో రూ.63.39 కోట్ల రాబడి తగ్గింది. సాగు భూమిని కొని ప్లాట్లుగా మార్చడం, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంపై స్థిరాస్తి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో సాగు భూముల కొనుగోళ్లు పెద్దగా జరగడం లేదని సమాచారం.
అంతంత మాత్రంగానే వ్యవసాయేతర రాబడి : గత ఆర్థిక ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం సాగు భూములకు సంబంధించి 65,762 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. వ్యవసాయేతర రాబడి కూడా అంతంతమాత్రంగానే ఉంది. గత సంవత్సరం రిజిస్ట్రేషన్ అయిన వ్యవసాయేతర దస్తావేజులతో పోల్చి చూడగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 మాత్రమే పెరిగాయి. రాబడి రూ.334.76 కోట్లు పెరిగింది. ఈ పెరుగుదల కేవలం మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నమోదైంది.
విదేశీ ప్రభావం :కొన్ని దేశాల్లో ఈ ఆర్థిక ఏడాది ఆరంభంలో నెలకొన్న ఆర్థికమాంద్య పరిస్థితులు కూడా రాష్ట్రంలో భూముల పెట్టుబడులపై ప్రభావం చూపాయని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లిన వారు ఎక్కువగా తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంటారు. విదేశాల్లో ఆర్థిక మాంద్యం, ఉద్యోగులకు లేఆఫ్లు తదితర కారణాలతో రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం రాక సన్నగిల్లిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన దృష్ట్యా డిసెంబర్ నుంచి మార్చి వరకు తిరిగి రాబడులు జోరందుకుంటాయని వారు భావిస్తున్నారు.