తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2023, 7:25 AM IST

ETV Bharat / state

Telangana Rains : రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి

Telangana Rain Alert Today : కుండపోత వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు వంకలు ఉరకలెత్తి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం సూచిస్తోంది. మరో మూడురోజులు వర్షాలున్నాయన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Heavy rains in Telangana
Heavy rains in Telangana

ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోతగా వానలు

Telangana Rains Toady : జిల్లాల్లో ఏకధాటి వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో జోరు వానలు కురిశాయి. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు ఎగువన ఛత్తీస్‌గఢ్‌ నుంచి వరద భారీగా చేరుతోంది. ప్రాజెక్టు 24గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 43అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ప్రస్తుతం 45 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందన్న కలెక్టర్ ప్రియాంక అలా లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త కాలనీని పరిశీలించిన కలెక్టర్ బాధిత ప్రజలతో మాట్లాడారు. స్థానిక పాఠశాలలో పునరావాస కేంద్రానికి వెళ్లాలని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. వృద్ధులు, గర్భిణిలు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారనే అంశాలను ఆరా తీశారు. గోదావరి కరకట్ట, విస్తా కాంప్లెక్స్ ఏరియాలో వరద పరిస్థితిని పరిశీలించారు. రామాలయం వద్ద చేరిన నీటిని ఐదు మోటార్ల ద్వారా తొలగించి వెంటనే శుభ్రపరచినట్లు తెలిపారు.

Rains in Telangana 2023 :ఎడతెరిపి లేని వాన వరంగల్ జిల్లా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ, వరంగల్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్లు ప్రాంతాల కాలనీల్లోకి వరదచేరుతోంది. కాశీబుగ్గలోని సాయిగణేశ్​నగర్‌తోపాటు డీకేనగర్ సమ్మయ్యనగర్ ప్రాంతాల్లోకి వర్షం నీరు చుట్టుముట్టింది. చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద తాత్కాలికంగా వేసిన గుడిసెలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరో మూడు రోజులు భారీ వర్షసూచన ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.

ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు, చంద్రుపట్ల, కృష్ణాపురం, మోడీకుంట వాగులో వరద పరిస్థితిని.. కలెక్టర్​ యంత్రాంగంతో కలిసి సమీక్షించారు. కాళేశ్వరంనుంచి వరద ఉద్ధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ముంపు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్ధన్నపేటలో ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై పెద్ద చెట్లు కూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సంపేట డివిజన్‌లో కురుస్తున్న వర్షాలకు పాకాల సరస్సు 18 అడుగులు.. మాదన్నపేట చెరువు 14 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది.

Heavy Rain Alert To Telangana : పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం: పరకాలలో చలివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంఎగువన వరదతో పరవళ్లు తొక్కుతోంది. పర్యాటకులను అటవీశాఖాధికారులు అనుమతించడం లేదు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి-భూర్ణపల్లి గ్రామాల మధ్య మట్టి రోడ్డు తెగి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సింగరేణి ఉపరితల గనుల్లో 16,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి సంస్థ రూ.3 కోట్ల ఆదాయం కోల్పోయింది. మహబూబాబాద్‌, జనగామ జిల్లాల్లోనూ వాగుల్లోకి వరద పోటెత్తుతోంది.

Telangana Rains Toady : మహబూబూబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లా అధికారులతో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు డిచ్‌పల్లి, ధర్పల్లి మండలాల్లో పాత ఇళ్లు కూలాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. డిచ్‌పల్లి మండలంలోని చెరువులు అలుగుపారుతున్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రాచూర్‌కి వెళ్లే రోడ్డు వర్షానికి బురదమయమై ప్రయాణించలేని అధ్వాన స్థితికి చేరింది. జనం తీవ్ర అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details