తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్రమత్తమైన పోలీసులు... సామాజిక మాధ్యమాలపై నిఘా.. - Telangana police on high alert in the wake of Bangalore Facebook riots

ఫేస్‌బుక్‌లో ఓ సున్నితమైన వ్యవహారానికి సంబంధించిన అభ్యంతరకర పోస్ట్‌ కారణంగా బెంగళూరు నగరంలో అల్లర్లు చెలరేగి పోలీస్‌ కాల్పులకు దారి తీయడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సప్‌.. తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే అంశాలపై నిఘాను మరింత విస్తృతం చేశారు.

Telangana police surveillance on social media
అప్రమత్తమైన పోలీసులు... సామాజిక మాధ్యమాలపై నిఘా..

By

Published : Aug 13, 2020, 6:52 AM IST

పోస్టుల్లో ఏవైనా వివాదాస్పద అంశాలుంటే వడబోసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే పోలీస్‌శాఖ వినియోగిస్తోంది. తొలినాళ్లలో సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఈ పరిజ్ఞానంతో నిఘా ఉంచేవారు. ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారానే తమ భావజాలాన్ని విస్తరింపజేయడంతో సానుభూతిపరుల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నిఘా అక్కరకొచ్చేది.

ఉగ్రవాద సంస్థలు తరచూ వినియోగించే పదజాలంతోపాటు రహస్య సంకేత పదాలు సామాజిక మాధ్యమ ఖాతాల్లో కనిపిస్తే ఇట్టే పట్టేసే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఐసిఎస్‌’, ‘ఇరాక్‌-సిరియా’ ‘అబూబకర్‌’.. తదితర పదాలను ఈ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఓపెన్‌గా చాట్‌ చేసే ఖాతాలో ఈ పదాలు కనిపిస్తే వెంటనే సాఫ్ట్‌వేర్‌ ఆ ఖాతాను గుర్తించేది. ఆ ఖాతాదారు సాగించే సంభాషణల పూర్తిసారాన్ని తెరపై సాక్షాత్కరింపజేసేది. ఒకవేళ ఉగ్రవాదం దిశగా ప్రేరేపించే సంభాషణలున్నట్లు గుర్తిస్తే ఈ ప్రక్రియను పరిశీలించే సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేసేవారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమ ఖాతాల వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా, కేవలం చట్ట వ్యతిరేక వ్యవహారాలపై మాత్రమే నిఘా అమలు చేసేవారు. కొంతకాలంగా సున్నితమైన అంశాలకు సంబంధించి అభ్యంతరకర పోస్టులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పెరిగిపోవడంతో అలాంటి అంశాలపైనా ఓ కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా బెంగళూరు అల్లర్ల ఉదంతంతో తెలంగాణ పోలీసులు ఈ నిఘాను మరింత విస్తృతం చేశారు.

కన్నేసి ఉంచాం...

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. అలాంటి పోస్టులపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుంది. ప్రాథమిక దశలోనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీనియర్‌ పోలీస్‌ అధికారులతోపాటు ఎస్‌హెచ్‌వోలను ఆదేశించాం. సురక్షితమైన తెలంగాణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలి. -మహేందర్‌రెడ్డి, డీజీపీ

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

ABOUT THE AUTHOR

...view details