తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులే ప్రాణాలు అర్పించారు తప్ప.. నాయకులు కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. మలిదశ ఉద్యమంలో విద్యార్థులదే కీలకపాత్ర అని అన్నారు. వందలాది విద్యార్థుల ప్రాణత్యాగాల వల్ల స్వరాష్ట్రం సాకారమైందన్న ఆయన... విద్యార్థుల ఆత్మబలిదానాలను రాజకీయంగా వాడుకున్నారని తెరాసపై విమర్శలు గుప్పించారు. ఆనాడు విద్యార్థుల ఉద్యమాన్ని కేసీఆర్ ఆక్రమించారని ఆరోపించారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమం చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి బంధీ
60 లక్షల విద్యార్థి నిరుద్యోగ యువత.. పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో బంధి అయ్యారని ఆరోపించారు. కనీసం తమ హక్కుల గళాన్ని సైతం వినిపించకుండా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఆఖరి పోరాటంగా విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజలు.. ఆరాధించే తెలంగాణ తల్లి... కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయిందని విమర్శించారు.
విద్యార్థి నిరుద్యోగ సైరన్ పేరుతో... అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు వివిధ రూపాల్లో ఆఖరి పోరాటంగా కాంగ్రెస్ కార్యచరణ తీసుకుంది. తెలంగాణ తల్లి... ఇప్పుడు కేసీఆర్ చేతుల్లో బంధీ అయింది.. విద్యార్థుల గళాన్ని వినిపిస్తాం. తెరాస ... విద్యార్థుల ఆత్మబలిదానాలను రాజకీయంగా వాడుకుంది.
------ రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు