తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2023, 7:21 PM IST

ETV Bharat / state

తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్​రెడ్డి మృతి.. సీఎం కేసీఆర్​ సంతాపం

Sridhar Reddy passed away: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు డాక్టర్​ శ్రీధర్​రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. జనతా పార్టీ, కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పనిచేసిన శ్రీధర్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీధర్​రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్​.. ఉద్యమానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు.

Sridhar Reddy
Sridhar Reddy

Sridhar Reddy passed away: తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు డాక్టర్​ శ్రీధర్​రెడ్డి మృతి చెందారు. 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన శ్రీధర్​రెడ్డి.. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం కన్నుముశారు. జనతా పార్టీ, కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పనిచేసిన ఆయన.. 2004 మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

జనతా పార్టీ, అఖిల భారత యువజన విభాగానికి గతంలో ఆయన నేతృత్వం వహించారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సన్నిహితుడైన శ్రీధర్ రెడ్డి.. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని పీడీఎఫ్​కు వ్యతిరేకంగా పనిచేశారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా తన సేవలు అందించారు.

'నమ్మిన విలువలకు కట్టుబడిన వ్యక్తి': శ్రీధర్​రెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్​ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం​.. తొలి, మలి దశలో తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. నమ్మిన విలువలు కోసం కట్టుబడి.. రాజీపడకుండా ఆయన పనిచేశారని కొనియాడారు. మంగళవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో శ్రీధర్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details