రబీలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలవడం గర్వకారణమని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాసవాన్ ట్వీట్ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రబీ సీజన్లో దేశవ్యాప్తంగా గోధుమలు, బియ్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్న కేంద్ర మంత్రి... దేశంలో కొనుగోలు చేసిన 50 లక్షల టన్నుల బియ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 44.36 లక్షల టన్నులని తెలిపారు.
ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్ - ధాన్యం కొనుగోలులో తెలంగాణ అగ్రగామి
కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన ఆరేళ్లలోపే రైతులకు ఎంతో మేలు జరిగిందని.. దేశంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ ట్వీట్ నేపథ్యంలో మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
![ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్ telanga accupied top place in grain buying](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7123377-1046-7123377-1588999651527.jpg)
అందులో తెలంగాణ నుంచి 34.36 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోళ్లు చేసినట్లు రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ట్వీట్ ప్రకారం రబీలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతులు, ప్రజానీకం గర్వించదగ్గ సందర్భంగా మంత్రి అభివర్ణించారు. కేవలం ఆరేళ్లలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన మార్పు కనిపిస్తోందని కేటీఆర్ తెలిపారు.
ఇదీ చూడండి :భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో..