తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2021, 8:32 PM IST

Updated : Aug 9, 2021, 9:23 PM IST

ETV Bharat / state

జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు: జల్‌శక్తి శాఖ

krmb
krmb

20:31 August 09

జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు: జల్‌శక్తి శాఖ

జల విద్యుత్ ఉత్పాదనపై కేఆర్ఎంబీ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదని పార్లమెంటుకు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్ట్‌లలో జల విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలంటూ  కేఆర్‌ఎంబీ పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని చెప్పింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

కేఆర్‌ఎంబీకి ముందస్తుగా చెప్పకుండా తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఏపీ సీఎం జగన్మోహన్​ రెడ్డి తమకు లేఖ రాసినట్లు తెలిపిన జలశక్తి శాఖ మంత్రి వివరించారు. ఏపీ విభజనచట్టం ప్రకారం కేఆర్‌ఎంబీకి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్‌ జారీ చేసినట్లు పేర్కొన్నారు.  

   శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌లో విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలంటూ జూన్‌ 17న తెలంగాణ జెన్‌కోను కేఆర్ఎంబీ ఆదేశించింది. జల విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్‌ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేఆర్ఎంబీ ఆదేశించినా.. శ్రీశైలం లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌తోపాటు నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పాదనను కొనసాగించినట్లు కేంద్రం పేర్కొంది. ఉత్పాదన నిలిపివేయాలని కోరుతూ కేఆర్ఎంబీ జులై 15న తెలంగాణ జెన్‌కో అధికారులను ఆదేశించిందని కేంద్రం తెలిపింది. కేఆర్‌ఎంబీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్‌కో (హైడల్‌) డైరెక్టర్‌ జులై 16న ప్రత్యుత్తరమిచ్చినట్లు వెల్లడించింది.

జల విద్యుత్‌ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నట్లు జెన్​కో అధికారులు కేఆర్‌ఎంబీకి తెలిపారని రాజ్యసభకు కేంద్రం చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీకి కల్పించిన  అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జులై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు రాజ్యసభకు లిఖితపూర్వకంగా  జల్​శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వివరించారు.  

ఇదీ చదవండి:NGT Fire on AP Govt: ఏపీ సర్కారుపై ఎన్జీటీ ఫైర్... ప్రాజెక్టుల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు

Last Updated : Aug 9, 2021, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details