Telangana govt bans illegal liquor : పొరుగురాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు 20 నుంచి 30శాతం వరకు అధికమని అబ్కారీ అధికారులు అంచనావేస్తున్నారు. ధర పెరగడంతో తక్కువ ధరకే.. మద్యం దొరికే రాష్ట్రాల నుంచి అక్రమార్కులు అనధికారికంగా రాష్ట్రానికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పడిపోతున్నట్లు.. అబ్కారీశాఖ అధికారులు గుర్తించారు.
illegal liquorban in Telangana :రాష్ట్రంలో సగటున 90 నుంచి 100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువ మద్యం విక్రయాలు జరగాల్సి ఉందని అబ్కారీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధరలు పెంచినందున రోజుకు రూ100 నుంచి 120 కోట్ల విలువైన విక్రయాలు జరగాల్సి ఉన్నా అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీ వల్లే తగ్గుతుటున్నట్ల భావిస్తున్నారు. వాటిని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తేనే.. తిరిగి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరింత ఊపందుకుంటాయంటున్నారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు.
డీజీపీతో జరిగిన సమీక్షలో అక్రమమద్యం, గుడుంబా తయారీసహా.. మాదకద్రవ్యాల సరఫరాపై చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమ మద్యంపై.. కఠిన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 2014 నుంచి ఇప్పటివరకు.. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమ మద్యం రవాణాచేస్తున్న 27,883 మందిపై కేసులు నమోదు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 161 మందిపై కేసులు పెట్టడంతోపాటు.. పలుసార్లు అక్రమమద్యం సరఫరాచేస్తూ నేరాలకు పాల్పడుతున్న 15 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. ఏ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరా అవుతుంది.. ఎక్కడెక్కడ గుడుంబా తయారు చేస్తున్నారు..ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే వివరాలను ఎక్సైజ్ శాఖ సేకరించింది.