తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 5:21 PM IST

ETV Bharat / state

Rythu Bandhu: రైతు బంధు కోసం నిధుల సమీకరణలో ప్రభుత్వం

రైతు బంధు(Rythu Bandhu) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ ఏడాది వానకాలానికి సంబంధించి జూన్​ 15 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జామ చేయనుంది. ఇందుకు కావాల్సిన నిధుల సమీకరణలో ప్రభుత్వం నిమగ్నమైంది. తాజాగా మరో 2500కోట్లకు బాండ్లు జారీ చేసింది.

Rythu Bandhu: రైతు బంధు కోసం నిధుల సమీకరణలో ప్రభుత్వం
Rythu Bandhu: రైతు బంధు కోసం నిధుల సమీకరణలో ప్రభుత్వం

రైతుబంధు(Rythu Bandhu) సాయం కోసం నిధుల సమీకరణలో ప్రభుత్వం నిమగ్నమైంది. కరోనా, లాక్​డౌన్​తో ఆదాయం తగ్గిన వేళ మరోమారు రుణాలపైనే ఆధారపడింది. ఈనెలలో ఇప్పటికే వెయ్యి కోట్లు, అప్పు ద్వారా సమకూర్చుకున్న సర్కార్ తాజాగా మరో 2500కోట్లకు బాండ్లు జారీ చేసింది. మరికొంత మొత్తాన్ని కూడా రుణాల ద్వారా సమకూర్చుకోనున్నారు.

ఏడు వేల కోట్ల అవసరం

వానాకాలం పంట సీజన్ కోసం రైతుబంధు సాయాన్ని15వ తేదీ నుంచి జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని... తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో మొదలు పెట్టి రైతులందరికీ పది రోజుల్లో సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు సాయం కింద ఏడు వేల కోట్ల రూపాయలకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.

తగ్గిన ఆదాయం

కరోనా ఉద్ధృతి, లాక్​డౌన్​తో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గింది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్​డౌన్ అమలవుతోంది. అంతకు ముందు నుంచే రాత్రి కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం సర్కార్ ఖజానాపై పడింది. మార్చి నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రావడంతో ఏప్రిల్ నెల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 6,500 కోట్ల రూపాయలు దాటింది.

మరో 2500 కోట్ల రుణం

ఆంక్షలు, రాత్రి పూట కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్​డౌన్​తో ఏప్రిల్ నెలలో వివిధ రంగాల కార్యకలాపాలు స్తంభించాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గనున్నాయి. ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఓ మోస్తరు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లు కొన్నాళ్ల పాటు నిలిచిపోవడంతో ఆ ఆదాయం వచ్చే అవకాశం లేదు. దీంతో పాటు ఇతర ఆదాయాలు కూడా తగ్గనున్నాయి. మే నెలలో సర్కార్ ఖజానాకు ఆదాయం బాగా తగ్గనుంది. ఏప్రిల్ నెలలో వచ్చిన ఆదాయంలో దాదాపు సగం వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం పది రోజుల్లో ఏడు వేల కోట్లకు పైగా నగదును రైతులకు బదిలీ చేయడం కష్టమైన పనే. ఇందుకు అవసరమైన నిధులు సమీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం... రుణాలపై ఆధారపడింది. ఈ నెల ఒకటో తేదీన వెయ్యి కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్న ప్రభుత్వం... తాజాగా మరో 2500 కోట్ల రుణానికి సిద్ధమైంది.

బాండ్లు జారీ

ఈ మేరకు 30 ఏండ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. ఈనెల ఎనిమిదో తేదీన బాండ్లు వేలం వేయనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకొంది. తాజాా రుణాలతో ఈ ఏడాది అప్పుల మొత్తం 8500కోట్లకు చేరనుంది. వీటితో పాటు ఈ నెలలో మరికొంత మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకోనుంది.

Suicide :ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details