తెలంగాణ

telangana

ETV Bharat / state

'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి' - latest news on telangana

చైనా, యూరప్ దేశాలను వణికిస్తున్న కరోనాపై మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అనవసర భయాలతో భయభ్రాంతులకు గురికావొద్దని మంత్రుల బృందం సూచించింది. కరోనా బాధితులకు అవసరమైన వైద్య సాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు భయాందోళనలు పక్కన బెట్టి.. పరిశుభ్రత పాటించాలని సూచించింది.

telangana government take action corona
'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'

By

Published : Mar 3, 2020, 11:11 PM IST

'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'

రాష్ట్రంలో తొలి కరోనా కేసు వెలుగుచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం... ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్​, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్​లో చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. యువకునితో పాటు బస్సులో వచ్చిన, 88 మందిని గుర్తించి... ఇప్పటి వరకు 45 మందికి గాంధీ ఆసుపత్రిలో నమూనాలు సేకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. సదరు యువకుని ఆరోగ్యం కూడా మెరుగైందని మంత్రి ఈటల తెలిపారు.

ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం

కరోనా వైరస్​ను గుర్తించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలెవరికీ వైరస్ రాలేదని... ఇక్కడున్న వారికి ఎవరికైనా వ్యాధి వస్తే కూడా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గాంధీ ఆస్పత్రితో పాటు ఆర్మీ, ఛాతీ, కింగ్ కోఠి, వికారాబాద్ ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు సిద్ధం చేశామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఐసోలేటెడ్ వార్డులు, చికిత్స ఏర్పాటు చేస్తామని వివరించారు.

మాస్కుల కొరత... కేంద్రానికి వినతి

మాస్కుల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సరఫరా చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ను కోరినట్లు ఈటల తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఈటల... ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. 104 హెల్ప్ లైన్ పూర్తి స్థాయిలో పని చేస్తుందని, తొమ్మిది శాఖల్లో నోడల్ అధికారులను నియమించి సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

కేరళకు 15 సభ్యుల బృందం

కేరళలో నిఫా వైరస్ వచ్చినపుడు ఎలా నిలువరించారో అధ్యయనం చేసేందుకు 15 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర బృందాన్ని అక్కడకు పంపనున్నారు. అవసరమైతే విశ్రాంత ప్రొఫెసర్లు, సిబ్బంది సేవలు కూడా వినియోగించుకోనున్నట్లు తెలిపారు. కేంద్ర సూచనల ప్రకారం ముందు జాగ్రత్తగా ఆయుష్ ద్వారా హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఈటల తెలిపారు.

కొన్నాళ్ల పాటు షేక్​హ్యాండ్స్​ వద్దు

స్వైన్ ఫ్లూ, సార్స్ కంటే కరోనా వల్ల తక్కువ శాతం మరణాలు ఉన్నాయని... బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వెళ్లే వారందరికీ వ్యాధి వ్యాపిస్తుందని అనుకోవడం సబబు కాదని ఈటల తెలిపారు. ఎప్పటికప్పుడు మనిషి తన చేతులను శుభ్రంగా కడుక్కుంటే 99 శాతం క్షేమంగా ఉండవచ్చని అన్నారు. జలుబు బారిన పడ్డవారు వైద్యున్ని సంప్రదించాలని, బహిరంగ ప్రదేశాల్లో దగ్గినా, తుమ్మినా చేతిరుమాలు అడ్డు పెట్టుకోవాలని సూచించారు. కొన్నాళ్ల పాటు ఎవరూ చేతులు కలపవద్దు, చేతులు జోడించి నమస్కారం పెట్టాలన్న మంత్రి... వీలైనంత వరకు నోరు, ముక్కు వద్దకు చేతులు పోకుండా చూడాలని చెప్పారు. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని... పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: జలుబు, జ్వరమా? అయితే సెలవు!

ABOUT THE AUTHOR

...view details