తెలంగాణ

telangana

ETV Bharat / state

టీచర్ల ఆస్తులకు సంబంధించిన ఉత్తర్వులపై స్పందించిన ప్రభుత్వం - మంత్రి సబితాఇంద్రారెడ్డి తాజా వార్తలు

government suspended school education orders
government suspended school education orders

By

Published : Jun 25, 2022, 8:37 PM IST

Updated : Jun 25, 2022, 9:26 PM IST

20:34 June 25

పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈనెల 8న జారీ చేసిన ఉత్తర్వులు ఈరోజు మధ్యాహ్నం వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ దుమారంతో పాటు ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. కేవలం ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈవిధంగా చేస్తోందని విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

విజిలెన్స్‌ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారని, పొరపాటు జరిగిందని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు మరో సర్క్యులర్‌ కూడా జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆస్తుల వివరాలు వెల్లడించడం కొత్తగా వచ్చిన నిబంధన కాదని, 1968 నుంచి అమల్లో ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, సాధారణంగా ఇచ్చిన సర్క్యులర్‌ పై దుమారం రేగడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఏం జరిగిందంటే?
నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్‌ జావేద్‌ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్‌బోర్డు సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. జావేద్‌ అలీపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్స్‌ చేసింది. జావేద్‌ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్‌ విభాగం సిఫార్స్‌ చేసింది. సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు ఉండాలని సూచించింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర..చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిఫార్సు మేరకు పాఠశాల విద్యాశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 25, 2022, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details