తెలంగాణ

telangana

By

Published : May 13, 2023, 7:08 AM IST

ETV Bharat / state

TS Govt on JPS Strike : 'మధ్యాహ్నం వరకు విధుల్లో చేరాల్సిందే.. లేదంటే మీ స్థానంలో కొత్తవారు'

TS Government on JPS Strike : రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు మధ్యాహ్నం 12 గంటల లోపు విధుల్లో చేరాలని.. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరు కాని వారి స్థానంలో తాత్కాలికంగా రూ.15 వేల నెల వేతనంతో కొత్త జేపీఎస్​లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

TS Government
TS Government

TS Government on JPS Strike : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగానే ముందుకు వెళ్తుంది. గత 15 రోజులుగా జేపీఎస్​ల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎస్​ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమ్మె చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారని తెలిసింది. ఇప్పటికే గత సోమవారం వరకు వారికి గడువు ఇచ్చారు.

విధులకు హాజరుకాకపోతే తొలగింపే..:తుది దఫాగా శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. ఆలోగా విధుల్లో చేరిన వారిని కొనసాగించాలని.. గైర్హాజరైన వారిని తొలగించాలని సూచించారు. విధులకు హాజరైన వారి జాబితాను మండల పరిషత్‌ అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కలెక్టర్లకు పంపించాలని సూచించారు. విధులకు హాజరుకాని వారిని తొలగించి, వారి స్థానాలను ఖాళీలుగా చూపించి.. వెంటనే నియామకాలు చేపట్టి కొత్త జేపీఎస్​లను తీసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల రోస్టర్‌ ప్రాతిపదికన నియామకాలు జరపాలని నిర్దేశించారు.

శని, ఆదివారాల్లో అన్ని రెవెన్యూ కార్యాలయాలు ఓపెన్​:స్థానికంగా ఉంటూ, డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్‌ పరిజ్ఞానం గల వారికి.. జేపీఎస్​లుగా ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. గతంలో జేపీఎస్ పరీక్షలు రాసిన వారికి ప్రాధాన్యమిస్తారు. నియామకాలపై గ్రామ పంచాయతీలకు ఎంపీడీవోలు సమాచారం ఇస్తారు. దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి, నియామకాలను ఆమోదిస్తూ తీర్మానిస్తారు. ఆ జాబితాలను కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్లు ఆ జాబితాను పరిశీలించి.. ఆదివారం ఖరారు చేస్తారు. ఎంపికైన వారికి సోమవారం నియామకపు ఉత్తర్వులిస్తారు. జేపీఎస్​ల తొలగింపు, తాత్కాలిక నియామకాల ప్రక్రియ కోసం శని, ఆదివారాల్లో అన్ని మండల పరిషత్‌ కార్యాలయాలు.. జిల్లా పంచాయతీ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఉద్యోగ భద్రత లేమితో జేపీఎస్​ బలవన్మరణం..: అటు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె 15వ రోజు కొనసాగింది. ఉదయం మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద వారు ధర్నాలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య కలకలం రేపింది. ఖానాపూర్ మండలం రంగాపురానికి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో ఒక్కసారిగా జేపీఎస్​ల సమ్మె ఉద్ధృతి పెరిగింది. సోనీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సహచర ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details