వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్పై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ కౌంటరు దాఖలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. వాయిదా పడిన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని విద్యా శాఖ కోరింది.
వైద్యుల సూచనల మేరకు కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించింది. ఒక్కో బెంచ్ కు ఒక్క విద్యార్థి మాత్రమే ఉంటారని.. ప్రతి విద్యార్థి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం ఉండేందుకు వీలుగా.. గతంలో ఉన్న 2 వేల 530 పరీక్ష కేంద్రాలను 4 వేల 535కి పెంచినట్లు ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల 442 మంది అదనపు సిబ్బందిని గుర్తించినట్లు తెలిపింది. సుమారు 2వేల మంది వైద్య సిబ్బంది సేవలు కూడా ఉపయోగించుకుంటామని వివరించింది.