తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త ఆయకట్టు లేనప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్‌ ఎందుకు? - telangana government news

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎటువంటి కొత్త ఆయకట్టు లేదని చెబుతున్నారని.. అలాంటప్పుడు ఆ ప్రాజెక్టు అవసరమే లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 34 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుంటున్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

telangana government on Rayalaseema project
కొత్త ఆయకట్టు లేనప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్‌ ఎందుకు?

By

Published : Aug 11, 2020, 7:24 AM IST

పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని గవినోళ్ల శ్రీనివాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై నిపుణుల కమిటీని నియమించిన ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)లను తమ వాదనలు తెలియజేయాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులపై వివక్ష చూపి కృష్ణా జలాలను పెన్నా, ఇతర బేసిన్లకు తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా అది కొనసాగుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనిని కచ్చితంగా నూతన ప్రాజెక్టుగానే పరిగణించాలి. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌-1 శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇతర బేసిన్లకు జలాలను కేటాయించలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంలో 15 టీఎంసీల తరలింపునకు చెన్నై తాగునీటి సరఫరా పథకం, 19 టీఎంసీల తరలింపునకు ఎస్సార్బీసీ చేపట్టారు. తెలంగాణలోని దిగువ ప్రాజెక్టులు, హైదరాబాద్‌ మహా నగర తాగు నీటి అవసరాలు, కరవు పీడిత ప్రాంతాల ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించే ఉద్దేశంతో తాజాగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలిస్తే నాగార్జునసాగర్‌ ఆయకట్టుతో పాటు ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు నీరందించే మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ నగరంలోని రెండు కోట్ల ప్రజల తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. నది దిగువన పర్యావరణంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోనందున ఈ ప్రాజెక్టు నిర్మాణం అక్రమమే’’ అని స్పష్టం చేసింది.

ఇతర బేసిన్లకు చట్టబద్ధమే అయితే....

కృష్ణా బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు నీటి తరలింపు చట్టబద్ధమేనని, అయితే తొలుత బేసిన్‌ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఎన్జీటీకి దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది. ‘‘కృష్ణా నదిపై చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలు, పాలమూరు-రంగారెడ్డిల ప్రాజెక్టులపై మా అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని జూన్‌, 4వ తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు సూచించాం. కేఆర్‌ఎంబీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందేవరకు ఆగాలని చెప్పాం. రెండు రాష్ట్రాలు ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరాం. రెండు వారాల్లో డీపీఆర్‌లు సమర్పించాలని కోరితే రెండు రాష్ట్రాల నుంచి అవి అందలేదు’’ అని పేర్కొంది.

ఇదీ చదవండి:కరోనాపై మోదీ పోరుకు గ్రామీణ భారతం ఫిదా!

ABOUT THE AUTHOR

...view details