తెలంగాణ

telangana

By

Published : Sep 29, 2021, 7:20 PM IST

Updated : Sep 29, 2021, 8:00 PM IST

ETV Bharat / state

TELANGANA LETTER TO KRMB: 'నాగార్జునసాగర్ కాలువల వద్ద అసమానతలు సరిదిద్దండి'

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్​ కుడి, ఎడమ కాలువల నీటి విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని లేఖలో కోరింది. రెండు కాలువల వద్ద ఉన్న అసమానతలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసింది.

TELANGANA LETTERR TO KRMB
TELANGANA LETTERR TO KRMB

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యంలో ఉన్న అసమానతలను సవరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కే‌ఆర్‌ఎం‌బీ (KRISHNA RIVER MANAGEMENT BOARD) ఛైర్మన్​కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ (TELANGANA ENGINEER IN CHIEF) మురళీధర్ లేఖ రాశారు.

నీటి విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలి..

1952లో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వైపున్న సాగర్ కుడి కాలువ, తెలంగాణ వైపున్న ఎడమ కాలువ.. హెడ్​రెగ్యులేటర్ల వద్ద నీటివిడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. కానీ 500 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు ఉంటే.. ఎడమ కాలువకు మాత్రం 520 అడుగులపైన నీరు ఉంటేనే 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉందని లేఖలో తెలిపారు.

సాగర్ కాలువల సామర్థ్యంలో తీవ్రమైన అసమానతలు..

నాగార్జునసాగర్ కనీస నీటి వినియోగస్థాయి అయిన 510 అడుగుల వద్ద.. ఎడమ కాలువ నీటి విడుదల సామర్థ్యం కేవలం 7,899 క్యూసెక్కులు మాత్రమే ఉండగా.. కుడి కాలువ సామర్థ్యం మాత్రం 24,606 క్యూసెక్కులు ఉందని ఈఎన్సీ మురళీధర్​ లేఖలో పేర్కొన్నారు. రెండు కాలువల సామర్థ్యంలో తీవ్రమైన అసమానత ఉందని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి (KRMB) తెలిపింది.

అసమానతలు సరిదిద్దాలి..

ఈ నేపథ్యంలో సాగర్​ కుడి, ఎడమ కాలువల హెడ్​రెగ్యులేటర్ల సామర్థ్యాల్లో అసమానతను సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. నీటి వినియోగస్థాయి (Minimum Drawdown Level) అయిన 510 అడుగుల వద్ద రెండు కాలువల నుంచి 11 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునేలా సామర్థ్యాలు ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఏపీలోని సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అవకాశం ఉన్నందున... బేసిన్ అవసరాలకు కృష్ణా జలాలను వదిలేసేలా ఆదేశాలు జారీచేయాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్​ను కోరినట్లు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRISHNA RIVER MANAGEMENT BOARD-KRMB)లేఖలో పేర్కొంది.

జలవిద్యుత్​ ఆపాలని..

కేఆర్​ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం నిన్న కూడా ఓ లేఖ రాసింది. ఏపీ నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని తెలంగాణ కోరింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టవద్దని విజ్ఞప్తి చేసింది. లేఖలోని అంశాలను జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని లేఖలో తెలంగాణ కోరింది.

ఇదీచూడండి:Krishna Board Chairman: ఏపీ నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని తెలంగాణ మరో లేఖ

Last Updated : Sep 29, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details