Telangana Formation Day Celebrations at Gandhi Bhavan : తెలంగాణ ప్రజలు దేనికోసం కొట్లాడారో.. ఆ లక్ష్యం నెరవేరలేదని లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. రాష్ట్రావిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మీరాకుమార్.. తెలంగాణ ప్రజల పోరాటం చూసి.. కాంగ్రెస్ త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్కు మాత్రమే తెలుసన్న ఆమె.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజ నర్సింహా, పొన్నం ప్రభాకర్, వీహెచ్, అంజన్కుమార్తో కలిసి గన్పార్కుకు చేరుకున్న మీరాకుమార్.. అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం.. బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ కాంగ్రెస్ చేపట్టిన ఆవిర్భావ దినోత్సవ ర్యాలీని మీరాకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ మీదుగా ఈ ర్యాలీ గాంధీభవన్కు చేరుకుంది.
బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది :అంతకుముందు గాంధీభవన్లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ ఆవిర్భావంపై పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పార్టీ నాయకులతో కలిసి మహేశ్కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ వచ్చిందన్న మహేశ్కుమార్ గౌడ్.. రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప.. సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో బీజేపీ, బీఆర్ఎస్లు ఒకటేనని నిరూపితమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు పట్టం కడతారన్న మహేశ్ కుమార్ గౌడ్...రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్ద్వారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు.