తెలంగాణ

telangana

మందుల కుంభకోణంలో బయటపడుతున్న దేవికారాణి లీలలు

By

Published : Nov 3, 2019, 4:17 AM IST

Updated : Nov 3, 2019, 12:20 PM IST

ఈఎస్​ఐ మందుల కుంభకోణంలో ప్రధాన నిందితురాలు దేవికారాణి అనేకసార్లు విదేశీ ప్రయాణం చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 23 దేశాలకు వెళ్లినట్లు ఏసీబీ విచారణలో బయటపడింది. ఆమె ఈఎస్‌ఐలో ఉద్యోగంలో చేరిన తర్వాతే ఈ ప్రయాణాలు చేసినట్లు సమాచారం సేకరించిన విచారణ బృందం అందుకు సంబంధించిన వ్యయాల గురించి ఆరా తీస్తోంది.

మందుల కుంభకోణంలో బయటపడుతున్న దేవికారాణి లీలలు

మందుల కుంభకోణంలో బయటపడుతున్న దేవికారాణి లీలలు

ఈఎస్​ఐ కుంభకోణం కేసులో దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె పలు మార్లు విదేశాల్లో సంచరించినట్టు తాజాగా అనిశా దర్యాప్తులో బయటపడింది. అమెరికా, యూరప్‌ ఖండాల్లోని పలు దేశాలతో పాటు మెుత్తం ఆమె 23 దేశాలకు వెళ్లి వచ్చినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈఎస్‌ఐలో ఉద్యోగంలో చేరిన తర్వాతే ఆయా దేశాలకు వెళ్లినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి ఎంత వ్యయం అయి ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు.

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, థామస్‌ కుక్‌, సాట్క్‌ అండ్‌ కింగ్‌తో పాటు మరో ఆపరేటర్‌ ద్వారా ఈ పర్యటనలు సాగించినట్టు గుర్తించారు. ఆమె పాస్‌పోర్టు ఆధారంగా ఆయా పర్యటనల గురించి అనిశా విశ్లేషిస్తోంది. సక్రమంగా సంపాదించిన డబ్బుతోనే ఈ పర్యటనలు సాగించారా, వాటిని ఆదాయపన్ను వివరాల్లో పొందుపరిచారా, అనే విషయాలను విచారణ బృందం తేల్చే పనిలో పడింది. విదేశాల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టారా అనే అంశంపైనా దృష్టి సారించారు.

అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?

మందుల కొనుగోలు కుంభకోణం అంతా దేవికారాణి చుట్టూ కేంద్రీకృతమైందని నిర్ధరణకు వచ్చిన ఏసీబీ అధికారులు ఆమె ఆడంబరంగా చేసిన వ్యయాలపై ఆరా తీస్తున్నారు. ఐఎంఎస్‌ కార్యాలయంలోనే అనధికారిక వేడుకలు నిర్వహించిన వ్యవహారాలపైనా లోతైన విచారణ జరుపుతున్నారు. 2018లో ఆగస్టులో తాజ్‌వివాంటా హోటల్‌లో ఆమె కుమార్తె నిశ్చితార్థం వేడుక, డిసెంబరులో మేడ్చల్‌ వద్ద హైందవ్‌ నియంత్రణ్‌లో జరిగిన వివాహ వేడుకను హంగు ఆర్భాటాలతో చేసినట్లు గుర్తించిన అనిశా అధికారులు ఆయా వ్యయాలపైన ఆరా తీస్తున్నారు. ఆమె కుమార్తె భాస్కర్‌ వైద్య కళాశాలలో మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీబీఎస్‌ కోర్సు చదవడానికి అయిన వ్యయం ఎక్కడిదని పరిశీలిస్తున్నారు.

లోతుగా విచారిస్తున్న అనిశా

దేవికారాణి కోట్ల రూపాయలతో బంగారం, వజ్రాభరణాలను కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ ఆ అంశాన్ని విశ్లేషించే పనిలో పడింది. మరో వైపు దేవికారాణి కుటుంబసభ్యుల ఆస్తులపై కూడా దృష్టి సారించిన అనిశా యంత్రాంగం ఆమె కుటుంబసభ్యుల పేరిట షేక్‌పేట్‌ ఆదిత్య ఎంప్రెస్‌ పార్కులో విల్లాతో పాటు రాజ్‌భవన్‌రోడ్డులోని సేథి టవర్స్‌లో ఫ్లాట్‌ గురించి ఆమె ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని నిర్ధరణకు వచ్చారు. ఈ నేపథ్యంలో దేవికారాణి ఆస్తుల వ్యవహారం ఇంకా లోతుగా పరిశీలించిన తర్వాత ఆ సమాచారాన్ని ఆదాయపన్ను శాఖకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మందుల కొనుగోలు కేసులో 17 మంది నిందితులను ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: కుంభకోణంలో దండుకున్న డబ్బుతో జల్సాలు

Last Updated : Nov 3, 2019, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details