తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Congress MLA Tickets Disputes : కాంగ్రెస్​లో అసమ్మతి నేతల రాగం.. 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణ

Telangana Congress MLA Tickets Disputes : కాంగ్రెస్​లో టికెట్​ రాని నేతలు ఒక్కొక్కరిగా తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా గాంధీభవన్‌లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. మేడ్చల్ టికెట్‌ హర్షవర్థన్ రెడ్డికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మరో నేత టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఆందోళన బాట పట్టారు. రేవంత్​రెడ్డి 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 4:00 PM IST

Updated : Oct 16, 2023, 6:51 PM IST

Telangana Congress
Telangana Congress

Telangana Congress MLA Tickets Disputes 2023 : రాష్ట్రంలో కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల అయిన తరువాత పార్టీలో అసంతృప్తి నేతల మాటలు పదునెక్కాయి. టికెట్​ రాని అభ్యర్థులు పలుచోట్ల తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. ధర్నాలు, నిరసనలు, హెచ్చరికలతో.. పార్టీపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అందోళన చేపట్టారు. మేడ్చల్ టికెట్‌ హర్షవర్థన్ రెడ్డికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మేడ్చల్‌ సర్వేల రిపోర్ట్ బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ (Congress)బచావ్‌ అంటూ నినాదాలు చేస్తూ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలన్నారు. మేడ్చల్‌ టికెట్‌ తనకే వస్తుందని హర్షవర్థన్ రెడ్డి ఆశించారు. కానీ కాంగ్రెస్‌ అధిష్ఠానం తోటకూర జంగయ్యకు కేటాయించింది.

Congress MLA Candidate List 2023 : ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సై.. మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​

Protests by Telangana Congress Dissident Leaders : మరో నేత టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ (TPCC Secretary Kuruva Vijay Kumar) గన్​పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్​ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి (Revanth Reddy) అమ్ముకున్నారని ఆరోపించారు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు అంటూ తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్​రెడ్డి 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నట్లు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని కురవ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్​ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారని కురవ విజయ్ కుమార్ మండిపడ్డారు. రేవంత్​రెడ్డి వల్ల రాష్ట్రంలో హస్తం పార్టీ తీవ్రంగా నష్టపోతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంటి దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తే.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్​రావు ఠాక్రే ఎలా పాల్గొంటారని కురవ విజయ్ కుమార్ ప్రశ్నించారు.

Congress Foremen Committee : అసంతృప్తుల బుజ్జగింపుపై అధిష్ఠానం ఫోకస్​.. జానారెడ్డి నేతృత్వంలో ఫోర్​మెన్ కమిటీ ఏర్పాటు

వెంటనే రేవంత్​రెడ్డిని టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కురవ విజయ్​ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే ఆయన అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్ట్​ను ప్రక్షాళన చేయాలని కోరారు. రేవంత్​రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు అతని అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తనకు రేవంత్ వల్ల ప్రాణభయం ఉందని చెప్పారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కురవ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Telangana Assembly Elections 2023 :మరోవైపు కురువ విజయ్‌ కుమార్‌ తీరుపై పార్టీలో చర్చ మొదలైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని.. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. హస్తం పార్టీకి నష్టపరిచేలా ప్రవర్తించిన విజయ్‌ కుమార్‌ను సస్పెండ్ చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారుకొండ వెంకటేశ్, పార్టీనేత మానవతారాయ్‌ ఫిర్యాదులో కోరారు.

దీనిని పరిశీలించిన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు నాయకులను.. కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. గద్వాల్ టికెట్ ఆశించిన కురువ విజయకుమార్, బహదూర్‌పుర నియోజకవర్గం టికెట్ ఆశించిన కలీమ్ బాబాలను క్రమశిక్షణ కమిటి ఛైర్మన్‌ చిన్నారెడ్డి సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. ఇవాళ గాంధీభవన్‌లో ఇతర క్రమశిక్షణ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టికెట్ రాలేదన్నఆక్రోశంతో గాంధీభవన్‌లో వీరు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు.

పార్టీ నాయకుల ఫ్లెక్సీలను చించి వేయడం, నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం లాంటి చర్యలను తీవ్రంగా పరిగణించినట్లు చిన్నారెడ్డి వివరించారు. హస్తం పార్టీ టికెట్ల కేటాయింపు ఏఐసీసీ నియమ నిబంధనల ప్రకారం జరుగుతుందని.. కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. టికెట్ల కేటాయింపులో పీసీసీ అధ్యక్షులను ఒక్కరినే బాధ్యలను చేయడం.. కక్షతో కూడిన చర్యగా భావించినట్లు చిన్నారెడ్డి వెల్లడించారు.

Telangana Congress MLA Tickets Disputes కాంగ్రెస్​లో అసమ్మతి నేతల రాగం

Uppal MLA Ticket Issue in Congress Party : 'కాంగ్రెస్​ను ఖతం చేయడానికే రేవంత్​రెడ్డి పార్టీలోకి వచ్చారు'

Telangana Congress MLA Candidates First List 2023 : తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Last Updated : Oct 16, 2023, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details