తెలంగాణ

telangana

CM KCR ON DALIT BANDHU: 'వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తాం.. దళితబంధు కోసం లక్షా 80 వేల కోట్లు ఖర్చుచేస్తాం'

By

Published : Oct 5, 2021, 9:57 PM IST

Updated : Oct 5, 2021, 10:56 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు తెచ్చారనేది దుర్మార్గమైన ప్రచారమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. శాసనసభలో దళితబంధుపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన సీఎం.. పథకానికి నిధుల కొరతలేదని.. వచ్చే బడ్జెట్​లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని (CM KCR ON DALIT BANDHU) స్పష్టం చేశారు. వచ్చే మార్చి నాటికి 100 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలుచేస్తామన్నారు. రెండు, మూడు నెలల్లో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఎస్సీలకు మూడెకరాలు ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్న కేసీఆర్​... మూడెకరాల కంటే తక్కువ ఉంటే.. ఆ మేరకు భూమి కొనిస్తామని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. పోడు భూముల సమస్యపైనా స్పష్టత నిచ్చిన కేసీఆర్​.. ఈనెల మూడో వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అసెంబ్లీలో (telangana monsoon assembly session 2021)ప్రకటించారు. ఎవరెన్ని కలలుకన్నా.. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు.

CM KCR ON DALIT BANDHU
CM KCR ON DALIT BANDHU

CM KCR ON DALIT BANDHU: 'వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తాం.. దళితబంధు కోసం లక్షా 80 వేల కోట్లు ఖర్చుచేస్తాం'

దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై శాసనసభలో (telangana monsoon assembly session 2021) చర్చ జరిగింది. తొలుత చర్చను చేపట్టిన తెరాస శాసనసభ్యుడు గాదరి కిశోర్‌.. ఇది దళిత జనోద్ధరణ ఉద్యమమని పేర్కొన్నారు. ఇది పథకం కాదని.. విప్లవమని అభిప్రాయపడ్డారు. చర్చలో భాగంగా మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... ఈ పథకానికి నిధులెలా తెస్తారో వివరించాలని కోరారు. నిధుల కొరత ఉంటే కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళితే భాజపా మద్దతిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు.

లక్షా 80 వేల కోట్లు పెద్ద లెక్క కాదు..

దళిత బంధుపై సభకు వివరణ ఇచ్చిన కేసీఆర్.. పథకానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉందన్నారు. క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేస్తామన్నారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో పథకం అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి.. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి ఆర్థికసాయం (CM KCR ON DALIT BANDHU) చేస్తామని తెలిపారు. 10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చన్నారు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చని సూచించారు. దళితబంధు నిధులతో పలానా పనే చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదన్నారు. దళితబంధు పథకానికి దాదాపు ఇప్పుడు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లతో.. నియోజకవర్గానికి 2 వేల మందికి దళిత బంధు అమలు చేస్తామన్నారు.

"రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నా. దళితబంధు (CM KCR ON DALIT BANDHU)పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైంది. క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచన మాకు ఉంది. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలని అనుకున్నాం. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉంది. అమలులో కనిపించే లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకెళ్తాం. రాష్ట్రంలో నాలుగు మూలల, విభిన్నమైన 4 మండలాలను ఎంపిక చేశాం."- సీఎం కేసీఆర్​

'వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తాం..'

దళితబంధు పథకం హుజూరాబాద్‌ ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదని కేసీఆర్‌ (kcr latest speech)స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడిన డబ్బులు వెనక్కి వెళ్తాయని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కలలు కన్నా.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచేది తామేనని.. భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు సీఎం కేసీఆర్‌ చురకలంటించారు.

"రఘునందన్ రావుకి చాలా పెద్ద సందేహం వచ్చింది. ఒక్క హుజూరాబాద్​కే విడుదల చేసిండ్రా.. వీటికి కూడా విడుదల చేసిండ్రా అని చెప్పి... ఇది ప్రభుత్వం రఘునందన్ రావు. మాకు చాలా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం. ముందర కూడా మేమే ఉంటాం. మీరు ఉండేదేందో సచ్చేదేందో. మాకు అన్ని అంచనాలు ఉన్నాయి. కొంతమందికి ఏదో ఈస్ట్​మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ మాది రాజకీయ పార్టీయే కదా మాదేమన్న మఠమా? మాకు తెల్వదా మాకు అంచనాలు, సర్వేలు ఉండవా? భవిష్యత్​లో కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది అందులో అనుమానం ఎందుకు? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఎందుకు పక్కన పెడతరు? ఏం కారణం చేత పక్కన పెడతరు. నేను అందుకే చెప్పిన మాకు ఆత్మ విశ్వాసం ఉందని. ఈ నాలుగు మండలాలకు రూ. 1,500 కోట్లు ఖర్చు అవుతాయి. మొదట్లో పెట్టుకున్న రూ. 1,000 కోట్లు కూడా ఖర్చు అవుతాయి. అంటే సుమారు 3వేల కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం మార్చిలోపల అమలవుతుంది." - కేసీఆర్, ముఖ్యమంత్రి

'బీసీ గణన జరగాలి..'

'రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64 శాతం ఎస్సీ జనాభా ఉందన్నారు. అనేక జిల్లాల్లో దళితుల జనాభా 20 శాతం దాటిందని పేర్కొన్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 17.53 శాతం మాత్రమే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్​ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనని (KCR ON BC CENSUS) ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కులగణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని శాసనసభ వేదికగా సీఎం పేర్కొన్నారు.'

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం..

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గిరిజనులకు భూములు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చించి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గిరిజనులను అడ్డంపెట్టుకుని అటవీభూములు కొట్టేసేవారు ఉన్నారని కేసీఆర్​ తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈనెల మూడో వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. అలాగే అటవీ భూములు ఇకపై అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రజాప్రతినిధులు, ప్రజలపై ఉందన్నారు.

'మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదే..'

తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పనేలేదని (kcr clarify on 3 acres to dalits) ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పానంటూ వివరణ ఇచ్చారు. దళితబంధు పథకంతో పాటు మూడెకరాల భూమి కూడా ఇస్తారా.. అంటూ మజ్లిస్‌ సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని.. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నామని చెప్పారు. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్​ స్పష్టం చేశారు.

"దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే 2 ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. ఎన్నికల అజెండాలోనూ అదే చెప్పాం."- సీఎం కేసీఆర్

నిరుద్యోగులకు తీపికబురు..

సీఎం కేసీఆర్​ ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశముందని సీఎం కేసీఆర్​ వివరించారు.

"నూతన జోనల్​ విధానం ప్రకారంగా రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తయిపోతుంది. ఆ తర్వాత.. ఏ జిల్లా వాళ్లకు ఆ జిల్లా కేడర్​ పోస్టులు ఇచ్చేస్తాం. ఏ మండలానికి ఎంత మంది సిబ్బంది ఉండాలనేది.. లెక్క ఉంటుంది. దాని ప్రకారం జిల్లాలో ఎంత మంది సిబ్బంది అవసరముంది అనేది తెలుస్తుంది. జోనల్​ విధానం అనేది ఈ మధ్యే వచ్చింది. అది ఒక్కసారి ల్యాండ్​ అయిపోతే మనకు కూడా ఎంత సంఖ్య ఉందని తెలుస్తుంది. ఆ ప్రక్రియ కూడా 2, 3 నెలల్లో రిక్రూట్​మెంట్​ చేసేస్తాం. కొంత మంది రేపే చేయాలి. ఎల్లుండే చేయాలని పట్టుపడుతున్నారు. అలా చేసేది కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది కదా. నిన్న గాక మొన్న కదా మన జోనల్​ విధానం వచ్చింది. మనం తీసుకొచ్చుకున్న జోనల్​ విధానాన్ని మనమే ధిక్కరించలేం కదా. అందుకే ఈ దసరా పండుగ తర్వాత ఉద్యోగులతో నేను మాట్లాడతా. ఇప్పటికే సీఎస్​ మాట్లాడారు. ఒక్కసారి సెట్​ అయిపోతే.. ఎక్కడివాళ్లకు అక్కడే రిక్రూట్​మెంట్​ జరుగుతుంది. ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాకు ఆనందంగా సేవ చేసుకుంటారు. నాకున్న అంచనా ప్రకారం.. ఇప్పుడిచ్చిన లక్షా యాభై వేలు కాక.. ఇంకో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు వస్తాయి. అవి కూడా సౌకర్యవంతంగా.. ఎక్కడి వాళ్లకు అక్కడే."- సీఎం కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఇదీచూడండి:kcr clarify on 3 acres to dalits: దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు: సీఎం

Last Updated : Oct 5, 2021, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details