కరోనా కాలం..అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉన్న సమయం. ఈ అవకాశాన్ని కొందరు గుత్తేదారులు ఉపయోగించుకున్నారు. చిరిగిన గోతాలను పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేశారు. ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల సంస్థ ఛైర్మన్ ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక రాక మునుపే గుత్తేదారులకు సంస్థ తాజాగా చెల్లింపులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి సీజనులో ధాన్యం కొనుగోళ్లకు 46 శాతం వరకు పాత గోతాలను వినియోగించాలి. అందుకు అనుగుణంగా గడిచిన యాసంగి కాలంలో ధాన్యం సేకరణ కోసం సుమారు ఎనిమిది కోట్ల వరకు ఒకసారి వాడిన గోతాలను తెలంగాణ పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఒక్కోదానికి రూ.24 చొప్పున చెల్లించేలా గుత్తేదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. సరఫరా అయిన వాటిలో చిల్లులు పడినవే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిల్లో నింపిన ధాన్యం చేరవేయడంలో అనేక ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆయా జిల్లాల రైస్ మిల్లర్లు అప్పట్లో కలెక్టర్లకు ఫిర్యాదులు చేశారు. ‘ఆ సంచులనే ప్రస్తుత వానాకాలం సీజనులోనూ వినియోగించాల్సి ఉంటుంది. వాటితో యాసంగిలోనే ఇబ్బందులు పడ్డాం. మళ్లీ వాటిని వాడటం సాధ్యం కాదంటూ’ మిల్లర్లు ఉన్నతాధికారుల దృష్టికీ తీసుకువచ్చారు.