Telangana Cabinet Sub Committee Meeting: జీవో 58, 59 ఉత్తర్వుల కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేసి.. వారం రోజుల్లో పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం బీఆర్కే భవన్లో సమావేశమై చర్చించింది.
మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి, పంపిణీకి సిద్ధం చేయాలని ఉపసంఘం అధికారులకు స్పష్టం చేసింది. కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రులు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందాలి: అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూడాలని ఉపసంఘం పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి, వారి జీవితాల్లో ఆనందం నింపాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపైనా సబ్ కమిటి చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆదేశించింది.