తెలంగాణ

telangana

కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. తెలంగాణకు నిరాశేనా.!

By

Published : Oct 5, 2021, 4:42 PM IST

తెలంగాణకు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదని.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పెండింగ్ ప్రాజెక్టులు కొనసాగడం లేదని వెల్లడించారు. ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసు విషయంలో కూడా సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన సమావేశంలో నిరాశే ఎదురైంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఎంపీలతో జీఎం సమావేశమయ్యారు. భేటీలో మూడు రాష్ట్రాల్లోని రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

mps meeting in rail nilayam
రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చ..

కాజీపేట్ కోచ్‌ ఫ్యాక్టరీ అవసరంలేదని రైల్వేశాఖ భావిస్తోందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. అదే విషయాన్ని అధికార పార్టీ ఎంపీలు కూడా తెలిపారని... కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయం చూడమన్నారని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఎంపీలతో సికింద్రాబాద్ రైల్‌ నిలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జీఎం పాల్గొన్నారు. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. పనులు పూర్తయిన మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులపై చర్చతో పాటు కాజీపేట కోచ్ పరిశ్రమ, చర్లపల్లి టర్మినల్ పనులపై చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమావేశంలో ప్రస్తావించారు.

నిధుల కొరతతోనే..

కాజీపేటకు వ్యాగన్‌ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం ఉందని గజానన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు ఆలస్యంగా సాగుతున్నాయని జీఎం పేర్కొన్నారు. సొంతంగా పూర్తి నిధులతో కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నామని జీఎం వివరించారు. అహ్మదాబాద్‌, ముంబయి బుల్లెట్ ట్రైన్‌ సక్సెస్‌ను బట్టే మిగతా ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తామని గజానన్‌ మాల్యా తెలిపారు.

బుల్లెట్ ట్రైన్ లేనట్లే

తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ ఆలోచన ఇప్పట్లో లేనట్లేనని గజానన్ స్పష్టం చేశారు. ఎంపీలతో కొత్త లైన్లు డబ్లింగ్ త్రిప్లింగ్​పై కూడా చర్చించినట్లు జీఎం తెలిపారు. ఎంఎంటీఎస్‌ రైళ్లను ప్రత్యేక పట్టాలపై నడపలేమని స్పష్టం చేశారు. ఉందానగర్‌ నుంచి రాజీవ్‌ గాంధీ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుపై చర్చలు నడుస్తున్నాయని.. దానిపై ప్రాథమిక అధ్యయనం చేశామని జీఎం పేర్కొన్నారు. సమావేశంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంపీలు నామ నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, మాలోతు కవిత, రంజిత్‌ రెడ్డి హాజరయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు.

నిధులెందుకు ఇవ్వరు..?

కాగా తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. ఎంపీ అర్వింద్ ఆరోపించారు. కొత్త లైన్ల ఏర్పాటుకు నిధుల్లేవని చెప్పడం.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్ల కుమ్మరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీ నామ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఏడేళ్లయినా కేంద్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. నిధుల కొరతతో రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ జరగడం లేదని అర్వింద్ అభిప్రాయపడ్డారు. ఎంఎంటీఎస్​ పనులతో పాటు, చాలా పనులు నిధులు లేకపోవడం వల్లే ఆగిపోయాయని ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏ రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ నుంచి దిల్లీ, ముంబయి కనెక్టవిటీ చేయాలని ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన తెచ్చాం. కరీంనగర్- తిరుపతి రైలు సర్వీసును నిజామాబాద్​కు పొడిగించమన్నాం. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ బోధన్ వరకు పెంచమని చెప్పాం. మాధవనగర్ ఆర్వోబీ... చాలా ఏళ్లుగా పెండింగ్​లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే పనులు ఆగిపోతున్నాయి. కేంద్రం ఒప్పుకున్నా కూడా.. రాష్ట్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం ఇచ్చే నిధులను టెక్స్ట్​ టైల్ పార్కుకు బదిలీ చేసి ఇవ్వమని కొందరు తెరాస ఎంపీలు అడుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం.- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

ఆ డబ్బులతోనే అభివృద్ధి చేయమన్నాం..

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం సరైన నిధులు ఇవ్వడం లేదని ఖమ్మం ఎంపీ, తెరాస లోక్​సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆరోపించారు. హైదరాబాద్​లో వచ్చే ఐదేళ్లలో రైల్వే ప్రణాళిక బ్లూ ప్రింట్ అడిగామని చెప్పారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో ఆదాయం వెళ్తోందని వెల్లడించారు. ఆ డబ్బుతోనే ఇక్కడ అభివృద్ధి చేయమని చెప్పినట్లు నామ పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా అందరు ఎంపీలు వచ్చారు. దక్షిణ భారతదేశం అంటేనే రైల్వేకు చిన్న చూపు ఏర్పడింది. పునర్విభజన హామీలో ఉన్న కాజీపేట్​ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును.. ఏడేళ్లయినా రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. ఈ అంశంపై రైల్వే బోర్డుకు, మంత్రిత్వ శాఖకు అందరు ఎంపీల తరఫున కాపీ పెట్టమన్నాం.

నామ నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ

రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చ..

ఇదీ చదవండి:cm kcr speech in assembly: 'మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details