తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలేమిటి?: హైకోర్టు - TELANGAN HIGH COURT on online Classes

ఫీజులపై ప్రభుత్వ జీవోలను ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలాపాలని హైకోర్టు ఆదేశించింది. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్​లో తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్​లు ఎందుకు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆన్​లైన్ తరగతులపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన భిన్నమైన అంశాలున్నాయన్న ఉన్నత న్యాయస్థానం.. సర్కారు బడుల్లోని పేద విద్యార్థుల గురించే తమ ఆందోళన అని వ్యాఖ్యానించింది.

TELANGAN HIGH COURT on online Classes
ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలేమిటి?: హైకోర్టు

By

Published : Aug 28, 2020, 7:04 AM IST

ప్రైవేట్ పాఠాశాలలు ఫీజుల వసూళ్లకు సంబంధించిన విషయంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎన్ని పాఠశాలలపై ఫిర్యాదులందాయి? ఏం చర్యలు చేపట్టారో నివేదిక ఇవ్వాలంది. ఫీజుల గురించి మాట్లాడటానికి వెళ్లిన తల్లిదండ్రులపై బోయినపల్లిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై కౌంటరు దాఖలు చేయాలంది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అస్పష్టత ఉందని వ్యాఖ్యానించింది. ఒకే ఇంటిలో ముగ్గురు పిల్లలున్నపుడు, ఒకే టీవీ ఉన్నపుడు తరగతులు ఎలా వినాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబరు 18కి వాయిదా వేసింది. అనుమతుల్లేకుండా ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు నిర్ణయం

సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏవైనా సందేహాలు వస్తే ఎలా తీర్చుకోవాలని, కూలీ అయిన తండ్రి, వంట చేసుకునే అమ్మ వారి సందేహాలు తీర్చలేరని, జామెట్రీలో వచ్చే సందేహాలను ఉపాధ్యాయులే పరిష్కరించగలరంది. గిరిజన ప్రాంతాల్లోని పేదల సంగతేమిటంది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల క్రితమే ఇది ప్రారంభమై విజయవంతమైందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రస్తుతం గురుశిష్యుల సంబంధం ఎలా ఉంటుందోనని, అమలుపై సందేహాలున్నాయని వ్యాఖ్యానించింది.

తల్లిదండ్రుల నిర్ణయం తీసుకున్నారా?

ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి సర్క్యులర్‌ జారీ చేశామని, 9 నుంచి 12 తరగతులకు సిలబస్‌ తగ్గించామని సీబీఎస్‌ఈ తరఫు న్యాయవాది ఛాయాదేవి తెలిపారు. విద్యార్థులు ఖాళీగా కూర్చునేకంటే ఎంతో కొంత నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా ప్రభావం తగ్గాక లోటును భర్తీ చేస్తామన్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు నిర్ణయం తీసుకునే ముందు సీబీఎస్‌ఈగానీ, ప్రభుత్వంగానీ తల్లిదండ్రులతో సంప్రదించారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించడంపై కేవలం సూచన మాత్రమే ఇస్తామని, ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని అందులో జోక్యం చేసుకోలేమంది. అమెరికాలో తరగతులు నిర్వహిస్తే 97 వేల మంది కొవిడ్‌ బారిన పడటంతో అధ్యక్షుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారంది.

మధ్యాహ్న భోజన పథకం ఎందుకు?

పాఠశాలలు జరగనపుడు మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలు చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పథకం అమలు చేయాలంటూ బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10 కిలోల బియ్యం, పప్పులు తదితరాలు అందజేస్తోందని తెలిపింది. ఆకలితో విద్యార్థులున్నారంటే సరిపోదని ఆధారాలుంటే సమర్పించాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.

ఇవీ చూడండి:విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details