తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకృతితో ఆటలొద్దు: కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ప్రకృతితో ఆటలొద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణహైకోర్టు ఆదేశం

కార్బైడ్‌ వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందంటూ 2015 ఆగస్టు 10న ‘పండు ఆరోగ్యం పుండు...రసాయనం దీనిపేరు’’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రకృతితో ఆటలొద్దని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

telagana High Court has directed the Central Government not to play with nature
ప్రకృతితో ఆటలొద్దు: కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

By

Published : Aug 29, 2020, 7:13 AM IST

కాయలు సహజసిద్ధంగా పండాలని... ఇందుకు విరుద్ధంగా రసాయనాలతో పండిస్తుండటంతో క్యాన్సర్‌ విపరీతంగా వస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రకృతితో ఆటలాడుకోవద్దని హితవు పలికింది. ఎథిఫాన్‌ వినియోగానికి సంబంధించి జారీ చేసిన ఎస్‌ఓపీ (ప్రామాణిక నిర్వహణ విధానం)తో పాటు, ఎథిఫాన్‌ వినియోగం హానికరమా కాదా అన్న అంశాలపై స్పష్టతనిస్తూ కౌంటరు దాఖలు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

కార్బైడ్‌ వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందంటూ 2015 ఆగస్టు 10న ‘పండు ఆరోగ్యం పుండు...రసాయనం దీనిపేరు’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం విదితమే. దీంతోపాటు ఎథిఫాన్‌ డీలర్లు, వ్యాపారులపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ గోల్డ్‌రైప్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, ఎస్‌జీఎస్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లతో పాటు ఎస్‌ఓపీని సవాలు చేస్తూ దాఖలైన మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎథిఫాన్‌ క్రిమిసంహారక పరిధిలోకే..

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఎథిఫాన్‌ క్రిమిసంహారక మందు పరిధిలోకి వస్తుందని, కేంద్ర ఆహార భద్రత, ప్రమాణ మండలి దీనికి అనుమతించిందని చెప్పారు. ఎథిఫాన్‌ను ఎస్‌ఓపీకి అనుగుణంగా వినియోగించవచ్చని కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ దీన్ని క్రిమిసంహారక చట్టంలో నిషేధిత రసాయనంగా పేర్కొంటూ మరోవైపు వినియోగానికి ఎలా అనుమతిస్తారంది. ట్రేడర్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎథిఫాన్‌ వినియోగానికి అనుమతి ఉందని, దీనికి కేంద్రం ఎస్‌ఓపీని విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరులో కూడా ఎథిఫాన్‌ను నిషేధించినట్లు పేర్కొనలేదన్నారు. పూర్తి వివరాలతో సెప్టెంబరు 15లోగా కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను 17వతేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:ఖైదీల విడుదలకు పూర్తికాని విధివిధానాల కసరత్తు

ABOUT THE AUTHOR

...view details