తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకా హత్య కేసుపై 'జగనాసుర రక్తచరిత్ర పుస్తకం'.. విడుదల చేసిన టీడీపీ - వివేకా హత్య తాజా వార్తలు

TDP RELEASED BOOK ON YS VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వివేకా హత్యకేసుకు సంబంధించి "జగనాసుర రక్త చరిత్ర" పేరిట తెలుగుదేశం నాయకులు ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. వివేకా హత్య కేసులో పాత్రధారులెవ్వరు ? సూత్రధారులెవ్వరు అనే వివరాలతో పుస్తకం రూపకల్పన చేశారు.

TDP RELEASED BOOK ON YS VIVEKA MURDER CASE
TDP RELEASED BOOK ON YS VIVEKA MURDER CASE

By

Published : Feb 10, 2023, 2:24 PM IST

TDP RELEASED BOOK ON YS VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వేళ్లన్నీ జగన్ రెడ్డి - భారతీ రెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని ఆరోపిస్తూ.. ఆయన హత్యకు సంబంధించిన "జగనాసుర రక్త చరిత్ర" పేరిట ఓ పుస్తకాన్ని తెలుగుదేశం నాయకులు విడుదల చేశారు. జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమ గీతం పాడుదాం- ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం నినాదంతో ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమా తదితరులు కలిసి పుస్తకాన్ని విడుదల చేశారు.

బాబాయ్ గొడ్డలి పోటులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ అబ్బాయేనని నేతలు ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ అండ లేకుండా ఇన్ని నేరాలు.. ఘోరాలు సాధ్యం కాదని ధ్వజమెత్తారు. వివేకా హత్య జరిగిన వేకువ జాము 3 గంటల సమయంలో నవీన్ ఫోన్ ద్వారా భారతీ రెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి ఫోన్ ద్వారా జగన్‌ రెడ్డితో మాట్లాడానని అవినాష్‌ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ వివరాలను పుస్తకంలో పేర్కొన్నారు. సీబీఐ ఛార్జిషీట్, వివేకా కుమార్తె సునీత అఫిడవిట్స్, వైయస్ కుటుంబసభ్యుల వాంగ్మూలాలు, అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం, సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ తదితర అంశాలను పుస్తకంలో పొందుపరిచారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రధారులెవ్వరు ? సూత్రధారులెవ్వరు అనే వివరాలతో పుస్తకం రూపకల్పన చేశారు.

వైసీపీ గుర్తింపు కోసం ఈసీకి లేఖ:టీడీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా సాగాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజల్లో టీడీపీ బలంగా ఉందని.. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని జగన్‌ చాలా నాటకాలాడారని.. కోడికత్తి డ్రామాతో ప్రజల్లో లబ్ధిపొందాలని జగన్‌ నాటకమాడారని ఆరోపించారు.

వివేకా హత్య కేసులో వాస్తవాలు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయని తెలిపారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్య చేయించారని ఆరోపించారు. వివేకా హత్యను టీడీపీపై మళ్లించేందుకు జగన్‌ చేయని ప్రయత్నం లేదని విమర్శించారు. వివేకా హత్య కేసు సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ గుర్తింపు రద్దు కోసం ఈసీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్యపై దుష్ప్రచారంతో 2019 ఎన్నికల్లో జగన్‌ లబ్ధిపొందారని లేఖ రాస్తామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details