తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవాదాయ శాఖ మంత్రిని,  ఈవోను తప్పించండి: చంద్రబాబు - ap news

ఏపీలో దేవాలయాల మీద దాడులు.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి రథానికి సంబంధించిన సింహపు ప్రతిమల మాయం ఘటనలపై.. తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి.. దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ దేవాదాయ శాఖ మంత్రిని, ఇంద్రకీలాద్రి ఈవోను తప్పించండి: చంద్రబాబు
ఏపీ దేవాదాయ శాఖ మంత్రిని, ఇంద్రకీలాద్రి ఈవోను తప్పించండి: చంద్రబాబు

By

Published : Sep 16, 2020, 2:55 PM IST

భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం దుర్మార్గమైన చర్యని తెదేపా అధినేత చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. 80కి పైగా ఆలయాలమీద దాడులు జరిగాయని ఆరోపించారు. ఇంద్రకీలాద్రిపై.. అమ్మవారి రథానికి చెందిన సింహపు ప్రతిమలు మాయమైన నేపథ్యంలో.. చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుర్గమ్మ ఆలయ ఘటనపై ఇంతవరకూ కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. దేవాదాయ శాఖ మంత్రిని, ఆలయ ఈవోను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

దేవాలయాలపై దాడులు నిత్య కృత్యంగా ఉన్నా.. ప్రభుత్వంలో మార్పు లేదని ఆగ్రహించారు. ఎవరు మాట్లాడినా.. ఎదురు దాడి చేసే పరిస్థితి ఉందన్నారు. గతంలో.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం, సోనియాగాంధీ వంటి పెద్దలు.. ఆలయ డిక్లరేషన్‌లో సంతకం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ... శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్‌.. ఏనాడూ డిక్లరేషన్‌లో సంతకం చేయలేదని అన్నారు. మత సామరస్యం కాపాడడం ప్రభుత్వం బాధ్యత కాదా.. అని ప్రశ్నించారు. 80 ఘటనలు జరిగితే సీఎంగా పరిపాలించటానికి అర్హత ఉందా? అని నిలదీశారు. ఆలయాలపై దాడులు చేసినవారు రేపు మసీదులపై చేయరనే నమ్మకమేంటని చంద్రబాబు.. ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించడం పోలీసులకు తగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు తిరగబడితే పారిపోవడం ఖాయమని హెచ్చరించారు. దేవాదాయ శాఖకు చెందిన నిధులు మళ్లింపునకు ప్రయత్నం జరిగిందని ఆరోపించిన చంద్రబాబు... ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడాలన్నారు. మొదటి సంఘటననే సీరియస్‌గా తీసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. అయోధ్య రామమందిర భూమి పూజను ఎస్వీబీసీలో లైవ్ ఇవ్వలేదని.. తితిదే డైరీలు సైతం తగ్గించేశారని అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా ప్రభుత్వం పని చేయాలన్నారు.

ఇదీ చూడండి:త్వరలోనే వార్డు ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తాం : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details