రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల కోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. గతంలో పలుమార్లు సమావేశమై చర్చించిన సీనియర్ నేతలు తాజాగా గురువారం మరోసారి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల మండలి స్థానానికి పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసిన ఆశావహులతో... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ వేర్వేరుగా సమావేశమయ్యారు.
వారికి దీటుగా...
దాదాపు 20 మందితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధికార తెరాస, భాజపా అభ్యర్థులకు దీటుగా నిలబడే వారినే బరిలో దించుతామని... పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన నేతలకు సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
మరోమారు సమావేశం...
మాణికం ఠాగూర్ అభ్యర్థుల ఎంపికపై ఇవాళ సీనియర్లతో మరోమారు సమావేశం కానున్నారు. ఎన్నికలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల మండలి అభ్యర్థి ఎంపికపై వారితో చర్చించనున్నారు. అనంతరం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికపై సమాలోచనలు చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.