Disha Encounter Case: దిశ హత్యాచారం అనంతరం జరిగిన ఎన్కౌంటర్ కేసులో విచారణ ఇకపై తెలంగాణ హైకోర్టులోనే జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇక్కడ విచారణ చేపట్టబోమని.. మిగతా అంశాలు హైకోర్టు చూసుకుంటుందని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఎన్కౌంటర్పై జస్టిస్ వి.ఎస్.సిర్పుర్కర్ కమిషన్ సమర్పించిన తుది నివేదికపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైదరాబాద్ శివార్లలో దిశ హత్యాచారం ఘటన అనంతరం నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై న్యాయవాదులు జి.ఎస్.మణి తదితరులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు దీనిపై విచారణకు జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను నియమించిన విషయమూ విదితమే. శుక్రవారం విచారణ సందర్భంగా కమిషన్ నివేదికను సీల్డు కవరులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని తిరస్కరించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ‘కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేరానికి పాల్పడిన వారిపై హైకోర్టు విచారణ చేపడుతుంది’ అన్నారు. దయచేసి నివేదికను తిరిగి సీల్ చేయాలని శ్యామ్ దివాన్ అభ్యర్థించారు. ‘బహిరంగంగా విచారణ చేపట్టిన తర్వాత గోప్యత ఏముంది? మీరు కోరితే నేను బయటకు చదివి వినిపిస్తా. రోజువారీగా ఈ కేసును మేం విచారించలేం. తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేదే ఇక్కడ ప్రశ్న. ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపడుతుంది. పిటిషన్దారులకు, ప్రతివాదులకు నివేదిక ప్రతులు అందజేస్తాం’ అని సీజేఐ తెలిపారు. ఈ అంశం ట్రయల్ కోర్టుకు వెళ్లేముందు విచారణలపై ఏ ప్రభావమూ పడకూడదని భావిస్తున్నామని శ్యామ్ దివాన్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కమిటీని నియమించిన తర్వాత నివేదిక ఏ విధంగానైనా రావచ్చని... దానికి కోర్టు ఏం చేస్తుందని సీజేఐ ప్రశ్నించారు. సీల్డు కవరులో నివేదికలు ఉంచాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని శ్యామ్ దివాన్ గుర్తుచేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలకు అది వర్తిస్తుందని.. ఇది ఎన్కౌంటర్ కేసని సీజేఐ బదులిచ్చారు. నివేదికను బహిర్గతం చేస్తే అది న్యాయపాలనపై ప్రభావం చూపుతుందని శ్యామ్ దివాన్ అన్నారు.