తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2023, 3:45 PM IST

ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు.. అదనపు బలగాల మోహరింపు

Student Unions Protest against TSPSC Paper Leakage: టీఎస్​పీఎస్​సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి, యువజన సంఘాలు భగ్గుమన్నాయి. వివిధ సంఘాల కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావటంతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయ యువమోర్చా, టీజేఎస్, ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు టీఎస్​పీఎస్​సీ ముట్టడికి యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని... బాధ్యులైన అధికారులను తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

TSPSC Paper Leakage
TSPSC Paper Leakage

Student Unions Protest against TSPSC Paper Leakage: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలంటూ భారతీయ యువమోర్చ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎస్​పీఎస్​సీ ఆఫీస్​ వద్దకు ర్యాలీగా తరలివచ్చివ యువమోర్చా శ్రేణులు... కార్యాలయ ముట్డడికి యత్నించారు. పలువురు కార్యకర్తలు కార్యాలయం గేట్లు ఎక్కి... లోపలకి దూకారు. మరికొందరు టీఎస్​పీఎస్​సీ బోర్డును ధ్వంసం చేశారు.

టీఎస్​పీఎస్​సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు:అప్పటికే పెద్దఎత్తున పోలీసులు అక్కడ మోహరించినా.... భారీగా తరలివచ్చిన కార్యకర్తలను నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలో కాసేపు టీఎస్​పీఎస్​సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా చేరుకున్న పోలీస్‌ బలగాలు... ఆందోళనకారులను లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ప్రశ్నాపత్రం లీకుతో సంబంధం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువమోర్చా నేతలు డిమాండ్‌ చేశారు.

ఛైర్మన్​పై వెంటనే చర్యలు తీసుకోవాలి: అంతకుముందు కమిషన్‌ కార్యాలయాన్ని తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం ముట్టడించింది. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితారామచంద్రన్​ను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షల విచారణ జరిపించాలని కోరారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కాగా... కార్యాలయం ముట్టడిలో భాగంగా టీజేఎస్ విద్యార్థి విభాగం నేతలు టీఎస్​పీఎస్​సీ కార్యాలయం గేటుపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారిని బేగంబజార్ ఠాణాకు తరలించారు.

టీఎస్​పీఎస్​సీ వద్ద అదనపు బలగాలు: టీఎస్​పీఎస్​సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఓయూలో బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీఎస్​పీఎస్​సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్​పీఎస్​సీలో గందరగోళ పరిస్థితులు, విద్యార్థి సంఘాల ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. కమిషన్‌ కార్యాలయం వద్ద అదనపు బలగాలు మోహరించాయి. శాంతి భద్రతలను అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ టీఎస్​పీఎస్​సీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరుగుతోందని అదనపు సీపీ విక్రమ్​సింగ్ తెలిపారు. ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్ట్ చేశామన్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీ విషయం మా దృష్టికి రాలేదన్న ఆయన... దానిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. వివిధ కోణాల్లో లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details