తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసారి కష్టమే... నియోజకవర్గాలకు నిధుల్లేవ్!

రాష్ట్రంలో శాసనసభ్యులు, మండలి సభ్యులకు ఇచ్చే అభివృద్ధి నిధులకు బ్రేక్‌ పడింది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో వివిధ శాఖలకు బడ్జెట్‌లో కోతలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సభ్యులకు ఇచ్చే నిధులకూ.. వర్తింపజేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన అభివృద్ధి హామీలపై సంశయం నెలకొంది.

By

Published : Sep 13, 2019, 5:28 AM IST

Updated : Sep 13, 2019, 7:40 AM IST

state-govt-on-cdp-funds

నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్​

2014-15 ఆర్థిక ఏడాదికి ముందు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కోటి రూపాయలు ఉండేవి. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాదే ఈ మొత్తాన్ని రూ.1.5 కోట్లకు పెంచింది. 2016-17 ఆర్థిక ఏడాదిలో కోటిన్నర నుంచి మూడు కోట్లకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల మొత్తాన్ని పెంచింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి ఏడాదికి మూడు కోట్లు ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతోంది.

ప్రతి ఏడాది రూ.480 కోట్లు..

నామినేటెడ్‌ శాసనసభ్యుడితో కలిపి 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు.. మొత్తం 160 మంది రాష్ట్రంలో ఉన్నారు. వీరికి ప్రతి ఏడాది రూ.480 కోట్లు మొత్తాన్ని నియోజకవర్గ అభివృద్ధి పనులకు ప్రతిపాదించాల్సి ఉంది. 2018-19 ఆర్థిక ఏడాదిలో రూ.362 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఆ తరువాత దాన్ని రూ.298 కోట్లకు సవరించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి నిధులు రూ.299 కోట్లు మాత్రమే వ్యయమయ్యాయి.

రూ.10వేల కోట్లు..

రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక అభివృద్ధి నిధులు పదివేల కోట్లు రూపాయలు కేటాయించినందున ఆ నిధులను నియోజకవర్గ అభివృద్ధి నిధులకు వాడుకునేందుకు అవకాశం ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతోంది. ఆర్థిక మాంద్యం, ఇప్పటికే ఈ ఆర్థిక ఏడాది అయిదు నెలలు గడచిపోయిన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిధులు కేటాయింపు చేసినట్లు పేర్కొంది. శాసనసభ్యులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ నిధులు అందుబాటులోకి వస్తే బాగుండేదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: జగన్​ వంద రోజుల పాలన భేష్​: నిరంజన్ రెడ్డి

Last Updated : Sep 13, 2019, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details