State Cabinet Meeting Today: రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్కు ఆమోదముద్ర వేయడమే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల కోణంలో మరోమారు భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మొదటి తొమ్మిది నెలల ఆదాయం, రాబడులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వచ్చేందుకు అవకాశం ఉన్న మొత్తం, తదితరాలను బేరీజు వేసుకొని.. రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తీసుకురానున్నారు. ప్రస్తుతం నడుస్తున్న 2022-23 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాతో రూ.2 లక్షలా 52 వేల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది లక్షా 93 వేల 29 కోట్ల రెవెన్యూ రాబడులు అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి అంచనాలకు అనుగుణంగానే ఖజానాకు సమకూరాయి.
15 శాతానికిపైగా వృద్ధి ఉండొచ్చు:రూ.లక్షా 9 వేల 800 కోట్ల ఆదాయం వచ్చింది. పన్ను ఆదాయం లక్షా 26 వేల 606 కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ చివరి నాటికి 92 వేల 66 కోట్లు సమకూరాయి. మిగిలిన మూడు నెలల్లోనూ ఇదే తరహాలో రాబడులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా పన్ను తదితరాల ద్వారా ఆశించిన ఆదాయం ఖజానాకు చేరుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 15 శాతానికిపైగా వృద్ధి ఉండవచ్చని భావిస్తున్నారు. పన్నేతర రాబడి కూడా రూ.10 వేల కోట్ల వరకు వచ్చింది. భూముల వేలం తదితరాలు కొనసాగుతున్న తరుణంలో పన్నేతర రాబడి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.
రుణాలకు సంబంధించి కేంద్రం ఆంక్షలు: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మాత్రం ఈ ఏడాది బాగా కోతపడింది. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు మాత్రమే వస్తున్నాయి. గ్రాంట్లను భారీగా అంచనా వేసినప్పటికీ రాష్ట్రానికి ఇప్పటికి వచ్చింది చాలా తక్కువే. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల మొత్తం దాదాపు 60 వేల కోట్లు అంచనా వేయగా... డిసెంబర్ నెల వరకు వచ్చింది 16 వేల కోట్లు వచ్చాయి. ప్రత్యేకించి గ్రాంట్ల విషయంలో సర్కార్ అంచనాలు భారీగా తప్పాయి. 41 వేల కోట్లు అంచనా వేస్తే... డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 7 వేల 770 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించి కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.