తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 5:17 PM IST

ETV Bharat / state

ఏపీ: శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్​లోనూ... కరోనా పంజా విసురుతోంది. ప్రాంతాలకు అతీతంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత, కార్యాలయ, భద్రతా సిబ్బంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. కానీ తాజాగా ఏపీలో తొలిసారి ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చింది.

srungavarapukota-mla-kadubandi-srinivasa-rao-have-tested-positive-for-covid
ఏపీ: శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్

ఏపీలో తొలిసారి ఓ శాసనసభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి వైకాపా తరఫున గెలిచిన కడుబండి శ్రీనివాసరావుకు కొవిడ్ నిర్ధరణ అయింది. రెండు మూడు రోజులుగా ఆయన ఆనారోగ్యం బారిన పడగా.. పరీక్షించిన వైద్యులు వైరస్ సోకినట్లు గుర్తించారు.

ఈనెల 10న అమెరికా నుంచి రాక

ఈనెల 10న అమెరికా నుంచి వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్ అని తేలగా... హైదరాబాద్, అమరావతి, విశాఖ, విజయనగరంలో పలువురు అధికారులు, వ్యక్తులను కలిశారు. సొంత నియోజకవర్గంలోనూ... విస్తృతంగా పర్యటించారు. అమెరికా నుంచి వచ్చిన ఆయనను మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.

రాజ్యసభ ఎన్నికల్లో ఓటేశారు..

బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనని శ్రీనివాసరావు... తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్నారు. అనంతరం చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులను కలిశారు. తిరిగి విజయనగరానికి వచ్చిన ఆయన స్వచ్ఛందంగా ట్రూనాట్ పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో కరోనా లక్షణాలు కనిపించగా... స్వాబ్ పరీక్షలు చేయటంతో పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడిన ఆయన... విశాఖలోని ఓ గెస్ట్ హౌస్​లో ఐసోలేట్ అయినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రాగా ఆయన గన్​మెన్​కూ పరీక్షలు జరపగా... వైరస్ సోకినట్లు తేలింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను క్వారంటైన్ చేశారు. ఇప్పటికే అందరి నమూనాలను సేకరించారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రైమరీ కాంటాక్ట్స్​పై కూడా అధికారులు అరా తీస్తున్నారు.

ఇవీ చూడండి:సంక్షేమాన్ని చూసి ఇతరపార్టీల వారు తెరాసలోకి వస్తున్నారు: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details