తెలంగాణ

telangana

ఆసుపత్రుల్లో సాధారణ చికిత్సలు.. అగమ్యగోచరమే!

కరోనా మహమ్మారి పెరుగుతున్న దరిమిలా సాధారణ రోగాలకు చికిత్స ఎంత కష్టమవుతోందో ఈ రెండు ఉదాహరణలు చూస్తే అవగతమవుతోంది. జ్వరం, జలుబు, దగ్గు ఉంటే చాలు కరోనాగా అనుమానిస్తున్నారు. పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ రోగాలకు మాత్రం వైద్య సేవలు గగనమవుతున్నాయి.

By

Published : Jul 23, 2020, 6:06 AM IST

Published : Jul 23, 2020, 6:06 AM IST

special story on Hyderabad covid hospitals
ఆసుపత్రుల్లో సాధారణ చికిత్సలు.. అగమ్యగోచరమే!

సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో గతంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించేవారు. కరోనా కేసులు పెరగడంతో పడకలకు డిమాండ్‌ ఏర్పడింది. తొలుత 50 పడకలు ఈ తరహా చికిత్సలకు కేటాయించారు. అయితే తాకిడి పెరగడంతో దాదాపు 200 పడకలను కరోనా సోకినవారికి కేటాయించాలని తాజాగా నిర్ణయించారు. దీంతో ఇతర సమస్యలతో వచ్చే రోగులను వేరే ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు.

బంజారాహిల్స్‌లోని ఓ వ్యక్తికి గుండెలో సమస్య రావడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని కారులో ఎక్కించి దాదాపు అయిదు ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. అన్నిచోట్లా చేర్చుకోవడానికి నిరాకరించారు. కొవిడ్‌ రోగులు ఎక్కువగా ఉన్నారని, తర్వాత ఇబ్బంది అవుతుందని తిరస్కరించారు. చివరకు సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో రూ.3 లక్షలు చెల్లించి చేర్పించారు.

హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సలపై దృష్టి పెట్టాయి. రోగుల సంఖ్య పెరగడం ఒక కారణమైతే...ఆసుపత్రులకు కాసులు కురిపించడం మరో ప్రధాన అంశం. కరోనా నిర్ధారణ అయిన వెంటనే చేర్చుకోవాలంటే రూ.లక్ష అడ్వాన్సు చెల్లించాల్సిందే.

తర్వాత ఆసుపత్రిని బట్టి రోజుకు రూ.30-40 వేల వరకు బిల్లులు వేస్తున్నారు. వెంటిలేటర్‌ అవసరమైతే ఖర్చు తడిసి మోపెడు ఖాయం. 10 రోజులపాటు ఆసుపత్రిలో ఉంటే తక్కువలో తక్కువ రూ.ఆరేడు లక్షలు చెల్లించాల్సిందే.

వైద్య బీమా ఉన్నా చాలా ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అంగీకరించినా...పీపీఈ కిట్లు ఇతర ఛార్జీల పేరుతో కొన్ని ఆసుపత్రులు బీమా మొత్తం కంటే ఎక్కువ బిల్లులతో బాదేస్తున్నాయి.

ప్రభుత్వ ప్రతిపాదిత ఛార్జీలు అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యం. ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సిబ్బంది జీత భత్యాలు, పన్నులు ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తక్కువకు సేవలు అందించడం కష్టమవుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

మొత్తానికి సామాన్యుడి జీవితం కరోనాతో అల్లకల్లోలం అవుతోంది. అప్పటివరకు కూడబెట్టిన సొమ్ములన్నీ ఊడ్చిపెట్టి చెల్లించి బతుకు జీవుడా అంటూ బయట పడుతున్నారు. ఆసుపత్రులన్నీ కరోనా చికిత్సలకే ప్రాధాన్యమివ్వడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు దిక్కులు చూడాల్సి వస్తోంది.

ప్రత్యేక ఓపీలు అవసరం

ప్రస్తుతం గాంధీని పూర్తిగా కొవిడ్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. కింగ్‌కోఠి, ఫీవర్‌, సరోజినిదేవి, ఆయుర్వేదిక్‌, నేచర్‌క్యూర్‌ తదితర ఆసుపత్రుల్లో కరోనా రోగుల కోసం ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేశారు.

ఉస్మానియాలో కూడా 50 పడకలు ఉన్నాయి. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఇక్కడ చేర్చుతున్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యాక గాంధీకి తరలిస్తున్నారు.

ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి ఇక్కడే చికిత్సలు అందించడం వల్ల కరోనా లేని వారు కూడా ఆ వ్యాధి బారిన పడుతున్నారు. నిమ్స్‌లో అత్యవసర విభాగంలో 90 వెంటిలేటర్లతో కూడిన పడకలు ఉన్నాయి.

అత్యవసర చికిత్సలకు వెళుతున్న రోగులకు పడకలు లేవని తిప్పి పంపుతున్నారు.ప్రైవేటులోనూ చాలా మేర ఇదే తంతు కన్పిస్తోంది.

ఉన్న పడకలన్నింటిని కొవిడ్‌ సేవలకు కేటాయిస్తుండటం వల్ల అత్యవసరంతోపాటు ఇతర సమస్యలతో వచ్చే వారిని తీసుకోవడానికి అవి నిరాకరిస్తున్నాయి.

అటు ప్రైవేటుతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ చికిత్సలకు ప్రత్యేక ఓపీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కరోనా లక్షణాలు ఉన్న వారిని వేరు చేసి ఇతర అనారోగ్య సమస్యలు, ప్రమాదాల్లో గాయపడి సేవల కోసం వచ్చే వారిని ఆసుపత్రిలో చేర్చుకొని సేవలందించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details