నగరం నిద్రపోతున్న వేళ వీధుల్లో విధులు అమ్మలా ఊరిని శుభ్రపరుస్తారు. వైద్యుడిలా నగర ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు. రాత్రి వేళల్లో పనిచేసి... తమ శ్రమను చీకట్లో దాచి.. స్వచ్ఛతా వెలుగులు అందరికీ పంచుతారు. వారే పారిశుద్ధ్య కార్మికులు. ఓ ఇంటిని శుభ్రం చేయాలంటేనే...ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చాలి. అలాంటిది కోటి జనాభా నివసించే హైదరాబాద్ నగరాన్ని ప్రతి రోజు శుభ్రం చేయడమంటే మాములు విషయం కాదు. హైదరాబాద్ నగరం నిద్రపోతున్న సమయంలో జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులు విధులకు హాజరై రోడ్లను ఊడ్చేస్తారు. ఉదయం నగర రోడ్లు చూడగానే అద్దంలా మెరుస్తాయి. ఈ మెరుపు వెనుక ఎందరో సఫాయి కార్మికుల కృషి దాగుంది.
ప్రాణాలను పణంగా పెట్టి
చెత్త తొలగింపు అనేది మామూలుగానే చాలా ఇబ్బందికరమైన పని. అలాంటిది కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ పారిశుద్ధ్య నిర్వహణ అనేది అంత తేలికేమీ కాదు. ఇలాంటి కీలక తరుణంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించారు. నిత్యం రోడ్లను ఊడుస్తూ, ఇళ్ల నుంచి చెత్తను తరలిస్తూ, రసాయనాలను చల్లుతూ శుభ్రంగా ఉంచారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు జంకే సమయంలో ఆస్పత్రిలోని చెత్తను కూడా తరలించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం శ్రమించారు. వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారు.
ధైర్యంగా విధులు
కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడ్డారు. అలాంటి చోట్ల సైతం పారిశుద్ధ్య కార్మికులు ధైర్యంగా విధులు నిర్వర్తించారు. భాగ్యనగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు సుమారు 20 వేలకు పైగా మహిళా పారిశుద్ధ్య కార్మికులు కష్ట పడుతున్నారు. కరోనాతో తమకు ఎలాంటి భయం లేదని... ప్రజలను కాపాడేందుకే విధులు నిర్వహించామని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. కరోనా లాక్డౌన్లో కొన్ని రోజులు ఇళ్లు వదిలి వేరు గదుల్లో ఉండి మరీ విధులు నిర్వహించారు. కుటుంబ సభ్యులు వారించినా...ధైర్యంగా బయటకు వచ్చి సామాజిక బాధ్యతగా పనులు చేశారు...ఈ కార్మికులు.
అత్యధికంగా మహిళలే
పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తించే సమయంలో పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురయ్యారు. గ్రేటర్ పరిధిలోనే విధులు నిర్వహించే సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. నగరవ్యాప్తంగా 25 వేలకు పైచిలుకు సఫాయి కార్మికులు ఉండగా.. వీరిలో అత్యధికులు మహిళలే. పురుషులతో సమానంగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో మందు బాబులతో...వేగంగా వాహనాలు నడిపే వారితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు వీధి కుక్కల బెడద వెంటాడుతూనే ఉంటుంది. పోకిరీల బెడదా ఎక్కువే. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ఇబ్బంది మరీ అధికంగా ఉంటోందంటున్నారు మహిళా కార్మికులు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాత్రి వేళ విధులు నిర్వర్తించే వారిని ఈటీవీ భారత్ పలకరించగా...తమ అనుభవాలు ఇలా పంచుకున్నారు.
కుటుంబానికి ఆసరా
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 25 వేలకు పైగా సఫాయి కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువగా పొరుగు సేవలు అందించేవారు, తాత్కాలిక కార్మికులే. జీహెచ్ఎంసీ వీరికి రూ.17,500 వరకు జీతభత్యాలు చెల్లిస్తోంది. గతేడాది దీపావళికి రూ.3వేల జీతాన్ని పెంచి వారి శ్రమకు కానుకగా ఇచ్చింది. అయినా కటింగ్లన్నీ పోను తమకు రూ.10 వేల పైచిలుకు జీతాలు చేతికొస్తాయని.. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తే శ్రమకు తగ్గ గౌరవం, తమ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
సఫాయీ.. నీకు సలాం
కరోనాపై పోరాటంలో ముందుండటమే కాదు..! టీకాలు వచ్చాక...తొలి వ్యాక్సిన్ తీసుకుంది పారిశుద్ధ్య కార్మికురాలే. పనిలో సంతృప్తి ఉన్నా...వేతనాల విషయంలోనే వీరిలో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, గౌరవ వేతనాల పెంపు లాంటి వినతులు బుట్ట దాఖలవుతున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఇదీ...పారిశుద్ధ్య కార్మికుల బతుకు చిత్రం. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు వారు పడే కష్టానికి సరైన ప్రతిఫలం దక్కాల్సిన అవసరముంది. ఏదేమైనా...రేయనకా..పగలకనా...శ్రమించే సఫాయీ...నీకు సలాం..!