తెలంగాణ

telangana

ETV Bharat / state

KALOJI: సగటు మనిషే కాళోజీ కవితా వస్తువు.. సంవాదం ఆయన కవితాశిల్పం..! - kaloji narayana rao special stories

మహాకవులు పండితుల కోసం రాస్తారు. ప్రజాకవులు సామాన్యుల కోసం రాస్తారు. మహాకవి కావడానికి చాలా తెలుసుకోవాలి. ప్రజాకవి కావడానికి చాలా వదులుకోవాలి. కాళోజీ అచ్చమైన ప్రజాకవి. నిరంతరం సామాన్య ప్రజల కోసం పలవరించారు. సగటు మనిషే కాళోజీ కవితా వస్తువు. సంవాదం ఆయన కవితాశిల్పం. పలుకుబడుల ప్రవాహం ఆయన భాష. ప్రజల గొడవను తన గొడవగా చేసుకొన్న కవి, జీవించిన కవి కాళోజీ. భారత ప్రభుత్వం ‘పద్మవిభూషణ్‌’ బిరుదుతో సత్కరించినా-ప్రజాకవిగానే మన్ననలందుకొన్న మహనీయుడు కాళోజీ నారాయణరావు.

ప్రజాకవి కాళోజీ జయంతి
ప్రజాకవి కాళోజీ జయంతి

By

Published : Sep 9, 2021, 8:18 AM IST

మహారాష్ట్ర రక్తం పంచుకున్నా, కర్ణాటక పాలు తాగినా, మడికొండ గాలి పీల్చినా- కాళోజీ మనిషిని ప్రేమించారు. మనిషి బతుకును ప్రమాణంగా భావించారు. కవిత్వం నిండా బతుకుతత్వాన్ని వినిపించారు. తెలంగాణ బతుకమ్మ నుంచి స్ఫూర్తి పొందినా, ఆల్బర్ట్‌ ష్విట్జర్‌ ‘రెవెరెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌’ నుంచి ప్రేరణ పొందినా జీవితాన్ని కాళోజీ సిద్ధాంతీకరించారు. ‘బతుకే భగవంతుడు. ఇచ్ఛయే ఈశ్వరుడు’ అని విశ్వసించారు. ‘బతుకుకు సాటి బతుకు. బతుకుకు కావలసింది బతుకు. బతుకు బతుకుతుంది బతుక్కోసం’ అనేది ఆయన వాదం. బతుకు సూత్రాన్ని అంత సులభంగా నిర్వచించిన కవి మరొకరు లేరు. ‘సాగిపోవుటె బతుకు. ఆగిపోవుటె చావు’ అన్నారు. అంతేకాదు. బతకాలంటే ‘తొలగితొవెవడిచ్చు... తోసుకొని పోవలయు’ అని వివరించారు. బతుకు ఒక పోరాటమని సూత్రీకరించారు.

కాళోజీ గొప్ప మానవవాది. మనిషిని మించిన మరోశక్తిని ఊహకైనా ఇష్టపడలేదు. యుద్ధాలు, ఉద్యమాలు, మతాలు, రాజకీయాలు, అక్షరాలు... ఏవైనా మనిషి కోసమేనని ఆయన భావించారు. మంచి చెడ్డలను ఎంచి చూసిన గురజాడ లాగే మనిషిలోని మంచి చెడులను సున్నితంగా కవిత్వీకరించారు. ‘మనిషి ఎంత మంచివాడు- చనిపోయిన వాని చెడును వెనువెంటనే మరుస్తాడు. కాని మంచినె తలుస్తాడు’ అని మనిషి మంచితనాన్ని ఆవిష్కరించారు. అంతలోనే ‘మనిషి ఎంత చెడ్డవాడు- బతికి ఉన్నవాని మంచిని గుర్తించడు. కాని వాని చెడును వెతికి కెలుకుతాడు’ అంటూ మరో కోణాన్ని వివరిస్తారు. అయినా- మనిషంటేనే కాళోజీకి ఇష్టం. ‘మనిషి బతుకు బతుకుతాను, నా మనసుకు నచ్చినట్టు మాట్లాడతా. రాస్తా. ప్రకటిస్తా’ అన్నారు. మనుషుల భావోద్వేగాలను అక్షరాల్లోకి వొంపారు. కాళోజీకి ఆర్ద్రత ఎక్కువ. అందువల్ల ఆవేశమూ ఎక్కువే. ‘పరుల కష్టము జూచి పగిలిపోవును గుండె- మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ అనుకొన్నారు. హృదయం కరిగినప్పుడే కదా కవి అయ్యేది. కన్నీరయ్యేది. కాళోజీ తన చుట్టూ ఆర్ద్ర దృశ్యాలు చూసి కరిగిపోయారు. ఎడతెగకుండా సాగుతున్న అన్యాయాలను చూసి ప్రశ్నించారు. నిజాం ప్రభువైనా సరే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రయినా సరే, భారతదేశం రాష్ట్రపతైనా సరే- మంద్రస్వరంతో హెచ్చరించారు. నియంతృత్వాన్ని ధిక్కరించారు. ప్రజలకోసం, సమ సమాజంకోసం అక్షరాలు ఎక్కుపెట్టారు.

కాళోజీకి మరాఠీ తెలుసు. కన్నడ భాష వచ్చు. ఉర్దూ చదువుకున్నారు. ఆంగ్లం అభ్యసించారు. అయినా తెలుగును అమితంగా ప్రేమించారు. తెలుగులోని జీవన మాధుర్యాన్ని రక్తగతం చేసుకున్నారు. తెలుగు భాషన్నా, తెలంగాణ పలుకుబడులన్నా అమిత ప్రీతి. కాళోజీకి ఆత్మగౌరవం ఎక్కువ. రాజకీయాల్లో, పాలనలో, జీవితంలో, భాషలో అవమానాల్ని సహించలేదు. సందర్భం చిక్కినప్పుడల్లా భావదాస్యాన్ని వ్యతిరేకించారు. స్వతంత్ర దృష్టి, స్వతంత్ర భావన కాళోజీ కవిత్వానికి వ్యక్తిత్వానికి వన్నెతెచ్చాయి. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగమయ్యారు. తెలంగాణ విమోచనోద్యమంలో లీనమయ్యారు. తెలుగుభాషా చైతన్యంలో ఉద్వేగభరితుడయ్యారు. ‘ఏ భాషరా నీది? ఏమి వేషమురా; ఈ భాష ఈ వేషమెవరి కోసమురా? తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?’- ఇలా కడిగి పారేయడమే కాళోజీ నైజం. అది కవిత్వమవునా, కాదా ఆయనకు అక్కర్లేదు. ‘జీవితానికి ఒక కచ్చితమైన నిర్వచనం, పద్ధతి లేనట్టే సాహిత్యానికీ లేదు. ప్రతీ సాహిత్య స్రష్టదీ ప్రత్యేకమైన దారి’ అని విశ్వసించి, ఆ మార్గంలో సాగిన అలసట లేని బాటసారి కాళోజీ. తెలుగు కవిత్వంలో నిరలంకారానికి, నిర్భీతికి, భావావేశానికి పరాకాష్ఠ ఆయన. నుడికారం ఘాటెరిగిన కవి, మమకారం మాటైన కవి, బతుకే పూజనీయమైన కవి కాళోజీ. ఆయనను శ్రీశ్రీ ‘నిఖిలాంధ్రకవి’ అన్నారు. ‘ఇరవయ్యో శతాబ్దపు ప్రజాకవి’ అని దాశరథి పిలిచారు. తెలుగు వారందరికీ ‘ప్రజాకవి కాళోజీ’. ఆయన జన్మదినం తెలుగుకు వెలుగుదినం. తెలంగాణకు వేడుక దినం.- డాక్టర్‌ నందిని సిధారెడ్డి,తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు.

CM KCR: కాళోజీ స్ఫూర్తి.. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details