తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవిలో నిరంతర విద్యుత్​ సరఫరా జరగాలి: రఘుమారెడ్డి

గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. సరఫరాలో అంతరాయాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

By

Published : Apr 3, 2021, 7:23 PM IST

spdcl cmd raghuma reddy
అధికారులతో రఘుమారెడ్డి వీడియో కాన్ఫరెన్స్​

వేసవి కాలంలో గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండెంట్​ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్, సర్కిల్ అధికారులు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అధికారులతో చర్చించారు.

వేసవిలో ఏర్పడే అదనపు లోడ్లు తట్టుకునేందుకు 56 పవర్ ట్రాన్స్​ఫార్మర్లు, 1725 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్​ఫార్మర్లు, 11 నూతన 33/11 కేవీ సబ్​ స్టేషన్లు ఏర్పాటు చేశామని రఘుమారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 33/11 కేవీ సబ్​స్టేషన్ల నిర్వహణ, ట్రాన్స్​ఫార్మర్ల లోడ్ బ్యాలెన్సింగ్ వంటి పనులు పూర్తి చేశామని అధికారులకు సీఎండీకి వివరించారు. విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లు, 33 ఫీడర్ల పని తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, సరఫరాలో అంతరాయాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎండీ ఆదేశించారు.

ఈ సీజన్​లో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వాడకం 80 మిలియన్ యూనిట్లకు మించుతుందని, సంస్థ పరిధిలో 185 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వాడకం నమోదయ్యే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. సంస్థ పరిధిలోని అన్ని రంగాల వారికీ నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని, ఒకవేళ వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడినా 1912/100, సంస్థ వెబ్​సైట్, సంస్థ మొబైల్ యాప్, ట్విట్టర్, ఫేస్​బుక్​ల ద్వారా తమకు తెలియజేయాలని సూచించారు.

ఇదీ చూడండి: 'విద్యుత్‌ మీటర్లు మార్చుకుంటే ఉచితంగా అందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details