పోలీసు ఎంపికల్లో గత నోటిఫికేషన్లలో ఎత్తు పరీక్షలో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులు.. ప్రస్తుతం అనర్హులవడం చర్చనీయాంశమైంది. పోలీస్శాఖలో కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేస్తూ.. ఎస్సై పరీక్షకు పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులు సైతం ఎత్తు విషయంలో అనర్హులుగా మారారని చెబుతుండడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. ఎంపిక ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ).. ప్రస్తుతం అభ్యర్థుల ఎత్తును డిజిటల్గా కొలుస్తోంది.
‘‘మాన్యువల్తో పోలిస్తే డిజిటల్ కొలతల్లో రెండు సెంటీమీటర్ల మేర తక్కువగా చూపిస్తోంది. దీంతో మాకు అన్యాయం జరుగుతోంది. మహిళా అభ్యర్థులకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతోంది. డిజిటల్ పరికరంతో ఒకసారి కొలిచినప్పుడు వచ్చే కొలతలు.. మరోసారి కొలిచినప్పుడు రావడంలేదు. ఈ పరికరాల్లో ఏమైనా లోపాలున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాం’’ అని పలువురు అభ్యర్థులు తెలిపారు.
కొన్ని ఉదాహరణలివీ..
* సంగారెడ్డికి చెందిన గౌతమ్ 2018 నోటిఫికేషన్లో ఎత్తు కొలతల పరీక్షలో 167.6 సెంటిమీటర్ల ఎత్తుతో ఉత్తీర్ణుడయ్యారు. ఈసారి డిజిటల్ నమోదులో 167.3 సెం.మీ. (ఉండాల్సిన కనీస ఎత్తు 167.6 సెంటీమీటర్లు) అని తేలడంతో అనర్హుడిగా ప్రకటించారు.