కొవిడ్-19 ఎన్నో జీవితాలు, కుటుంబాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఏకంగా జీవన శైలి, ఆరోగ్యం, ఆహారపు అభిరుచులు నేర్పింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా... ప్రత్యేకించి భారతీయ సమాజంలో ఉన్నత విద్యాభ్యాసం... ఎన్ని ఉద్యోగాలు చేసి ఎంత డబ్బు సంపాదించినా... ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా తినాల్సింది ఆహారమే. ఇప్పటి దాకా రసాయన, క్రిమిసంహారక అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులు తినడం వల్ల ఆరోగ్యాలు చిధ్రం చేసుకుంటున్న తరుణంలో... రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే రసాయన అవశేషాలు, కల్తీ లేని ఆహారం, పౌష్టికాహారం తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని ఓ ప్రవాస భారతీయురాలు భావించారు.
హైడ్రోపొనిక్ విధానం...
యూకేలో ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న దారపురెడ్డి తేజ స్రవంతి... కొవిడ్ సమయంలో తిరిగి భారత్ విచ్చేసింది. అప్పటికే యూకేలో పలు ప్రాంతాల్లో హైడ్రోపోనిక్ టెక్నాలజీ సాయంతో ఆకుకూరలు, కాయగూరల సాగు, విధానం, మార్కెటింగ్పై అధ్యయనం చేసిన ఆమె... హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసే తన సోదరుడు తేజకార్తీక్తో కలిసి హైటెక్ వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. నిజాంపేటకు చెందిన వీరిద్దరూ ఇద్దరూ ఉద్యోగాలు వదిలేసి నగర శివారు దుండిగల్ సమీపంలోని అన్నారం వద్ద 2 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నారు. రెండు షెడ్లలో హైడ్రోపోనిక్ విధానంలో కూరగాయలు పండిస్తున్నారు. మరో ఎకరంలో కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. మక్కువతోనే ఆధునిక పద్ధతుల్లో సేద్యంలో సఫలం అయ్యామని... దేశీయ ఆకుకూరలు పండిస్తున్నామని యువ రైతు తేజ స్రవంతి సంతోషం వ్యక్తం చేశారు.
అనుభవం లేకున్నా...
ఏ మాత్రం అనుభవం లేదు. కొత్త టెక్నాలజీ, శాస్త్రీయపరమైన సాగు విధానం కావడంతో మొదట్లో బంధువులు, స్నేహితులు ఎవరూ వెన్నుతట్టి ప్రోత్సహించలేదు. అయినా వ్యవసాయంపై ప్రేమే ఇద్దరినీ అడుగులు ముందుకు వేసేలా చేసింది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా సహజ సిద్ధంగా పండించిన ఆకుకూరలు సరఫరా చేయాలన్న లక్ష్యంతో డిసెంబరులో సొంత నిధులు, సన్నిహితుల ద్వారా సమకూర్చిన రూ. 70 లక్షలు వెచ్చించి ఈ ప్రాజెక్టు నెలకొల్పారు.
నీరు, నేల, ఏ ఇతర కల్తీ లేకుండా సురక్షిత పద్ధతుల్లో పాలకూర, తోటకూర, ఎర్రతోటకూర, కొత్తమీర, పుదీనా వంటి దేశీయ ఆకుకూరలు, గ్రీన్ ఇండివ్, లెట్ట్యూస్ ఐస్బెర్గ్, గ్రీన్ సెలెరీ, క్యాబేజీ వంటి విదేశీ ఉత్పత్తులు పండిస్తున్నారు. ఆరుబయట క్షేత్రంలో బ్రకోలీ, రెడ్ క్యాలీఫ్లవర్ పండిస్తున్నారు. బోర్ నీటిని ఆర్ఓ ప్లాంట్లో శుద్ధి చేసి సూక్ష్మ సేద్యం కింద రీసైక్లింగ్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. ఈ విధానంలో 80 నుంచి 85 శాతం ఆదా అవడం ఓ ప్రత్యేకత. ఆ ఉత్పత్తులన్నీ నవంబరు 5 నుంచి చేతికొస్తున్నాయి.