హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో పలువురు చిన్న వ్యాపారుల్ని ‘ఈనాడు’ పలకరించగా వారంతా తమ కష్టాల్ని ఏకరువు పెట్టారు. ఎలక్ట్రికల్, మిఠాయి దుకాణాలు, గిఫ్ట్షాప్లు, క్షౌరశాలలపై లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లాభాలు దేవుడెరుగు..కనీసం ఖర్చులకు సరిపడా రాబడి రావడం లేదు. ఫలితంగా చాలామంది దుకాణాలు మూసేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే మూసేశారు. ‘అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శానిటైజేషన్ చేస్తున్నా, జనాలు క్షౌరశాలకు రావడానికి భయపడుతున్నారు. ఎక్కువ మంది ఇళ్లలోనే క్షవరం చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే 40 శాతం కూడా ఆదాయం రావట్లేదు’ అని తట్టి అన్నారంలోని ఓ క్షౌరశాల యజమాని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వినియోగదారులు పెద్దగా రావడం లేదు. ఆదాయం లేదు. అద్దె భారంగా మారింది.
దుకాణం మూసేశా. తెలిసిన వాళ్లు, పాత వినియోగదారులు ఫోన్ చేస్తే వెళుతున్నా’ అని హయత్నగర్కు చెందిన ఎలక్ట్రీషియన్ చంద్రశేఖర్ చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.
లాక్డౌన్కు ముందు రోజూ సుమారు రూ.20 వేల వరకు వ్యాపారం జరిగేది. 12 మంది కుర్రాళ్లు పని చేసేవారు. రెండు నెలలు దుకాణం మూసేయడంతో పనివాళ్లంతా సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మళ్లీ వాళ్లను రప్పించాలంటే బయానాలు ఇవ్వాలి. దానికి బోలెడంత ఖర్చువుతుంది. దుకాణం నిర్వాహణకు, ఇతర సరకుల పెట్టుబడి కోసం తెచ్చిన సొమ్మే సకాలంలో చెల్లించలేకపోతున్నాం. ప్రస్తుతం వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదు. దుకాణం నిర్వాహణ కష్టంగా ఉంది.
- కేటీ.చిత్రజన్, సాయి కేరళ బేకరీ, భూపాలపల్లి
దుకాణం పోయింది..తోపుడు బండి వచ్చింది