తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR Hospitalised: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. ఎలాంటి ఇబ్బందుల్లేవన్న వైద్యులు - Medical tests for KCR at Yashoda Hospital

Slight illness to Chief Minister KCR
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత

By

Published : Mar 11, 2022, 11:33 AM IST

Updated : Mar 12, 2022, 4:15 AM IST

11:30 March 11

కేసీఆర్‌కు అస్వస్థత

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత

KCR Hospitalised:ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో పాటు ఎడమచేయి నొప్పిగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు శుక్రవారం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అన్ని ఫలితాలు సాధారణంగా వచ్చాయని, ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుందని వైద్యులు ప్రకటించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ ఎంవీ రావుతోపాటు ఇతర వైద్యులు శుక్రవారం ఉదయం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంను పరీక్షించారు. ఈ క్రమంలో మరికొన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి రావాలని సూచించారు. దీంతో ముందుగా నిర్ణయించిన యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్న సీఎం యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు, చీఫ్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ విష్ణురెడ్డిల ఆధ్వర్యంలో సీఎంకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్నీ సాధారణంగానే ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సీఎం తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లారు.

భేషుగ్గా ముఖ్యమంత్రి ఆరోగ్యం: వైద్యులు

‘‘ముఖ్యమంత్రికి వివిధ రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రామ్‌, ఈసీజీ, 2డి ఎకో, మెదడు, వెన్నెముకలకు ఎంఆర్‌ఐ పరీక్షలను నిర్వహించాం. గుండె ఆరోగ్యం బాగుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరులో సమస్యలు లేవు. మధుమేహం, రక్తపోటు నియంత్రణలోనే ఉన్నాయి. వెన్నెముకలో కొంచెం సమస్య ఉన్నట్లుగా ఎంఆర్‌ఐలో గుర్తించాం. సీఎం ఎక్కువగా చదవడం, ఐప్యాడ్‌ చూస్తుండడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడి సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్య తలెత్తింది. దాంతో ఎడమ చేయి నొప్పి పుడుతోంది. న్యూరో ఫిజీషియన్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా పర్యటనలు చేయడంతోపాటు బహిరంగ సభల్లో మాట్లాడటం వల్ల నీరసం వచ్చి ఉంటుంది. వేసవితో పాటు వయసు రీత్యా ఇది సాధారణమే. అందుకే విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతివారం ఇంటి వద్దే రక్తంలో షుగర్‌ ఎంతుందనే పరీక్ష చేయించుకోవడం మంచిది. విశ్రాంతి తర్వాత సాధారణ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనవచ్చు’’ -డాక్టర్‌ ఎంవీ రావు, సీఎం వ్యక్తిగత వైద్యుడు

‘‘సీఎం తనకు ఎడమ చేయి లాగుతోందని చెప్పడంతో.. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏమైనా ఉన్నాయా అని అనుమానించాం. వెంటనే కరోనరీ యాంజియోగ్రాం చేశాం. పూడికలేమీ లేవని తేలింది. ఆయన ఆరోగ్యం బాగుంది. విశ్రాంతి తర్వాత ఆయన ఉత్సాహంగా పనిచేస్తారు’’ -డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, యశోద చీఫ్‌ కార్డియాలజిస్టు

సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌ దంపతులు, మనవడు హిమాన్షు, కుమార్తె కవిత, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, రెడ్యానాయక్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు ఉన్నారు. సీఎం రాకతో సోమాజిగూడ యశోద ఆసుపత్రి వద్ద జనం గుమిగూడారు. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. పోలీసులు సమన్వయం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు.

Last Updated : Mar 12, 2022, 4:15 AM IST

ABOUT THE AUTHOR

...view details