తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తునకు సిట్​ ఏర్పాటు - sit on former government corruption

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో అమలైన నిర్ణయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తూ వైకాపా సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్​ రఘురామ్‌రెడ్డి ఈ సిట్‌ బృందానికి నేతృత్వం వహించనున్నారు. సీఆర్​డీఏ పరిధిలో అవకతవకల ఆరోపణలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్‌ దృష్టి సారించనుంది.

sit-on-former-government-corruption
గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తునకు సిట్​ ఏర్పాటు

By

Published : Feb 22, 2020, 7:58 AM IST

గత తెదేపా ప్రభుత్వం అమలు చేసిన కీలక విధానాలపై దర్యాప్తు జరిపించేందుకు వైకాపా సర్కారు మరో అడుగు వేసింది. ఏపీ నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత ప్రభుత్వ ముఖ్యమైన విధానాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన సంస్థలు,ముఖ్యమైన పాలనా అనుమతుల్ని సమీక్షించేందుకు..గతంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా.. అది నివేదిక ఇచ్చింది. ఉపసంఘం తన నివేదికలో పొందుపరిచిన అంశాలపై ఇప్పుడు సిట్‌ దర్యాప్తు చేయనుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో మొత్తం పది మంది పోలీసు అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో రఘురామ్‌రెడ్డి సహా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు, ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత విధాన, న్యాయ, ఆర్థికపరమైన అవకతవకలు అనేకం జరిగాయని.. సీఆర్​డీఏ పరిధిలో భూములు సహా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రివర్గ ఉపసంఘం... తన నివేదికలో పేర్కొంది. ఉపసంఘం తన నివేదికలోని మొదటి భాగాన్ని ప్రభుత్వానికి అందజేసింది. నివేదికపై క్షుణ్నంగా చర్చించి, ఆమోదించిన తర్వాత ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నివేదికపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చ జరిగింది. ఆ అంశంపై క్రమబద్ధమైన, సమగ్ర దర్యాప్తు జరిపించాలని శాసనసభాపతి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ నేపథ్యంలో అన్ని అంశాల్నీ నిశితంగా పరిశీలించాక సిట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సిట్​ అధికారాలు..

నిర్దేశిత అంశాలపై సీఆర్​పీసీ నిబంధనలకు అనుగుణంగా సిట్‌ విచారణ జరపనుంది. కేసులు నమోదు చేయడం, దర్యాప్తును అధికారులు కొలిక్కి తేనున్నారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు జరపడం, సమన్వయం చేసుకోవడం, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం వంటివి చేయనున్నారు. విచారణ, దర్యాప్తులో భాగంగా ఏ వ్యక్తినైనా, అధికారినైనా తమ వద్దకు పిలిపించుకుని... వాంగ్మూలం నమోదు చేసే అధికారం సిట్‌కి ఇచ్చారు. నిర్దేశిత అంశాలు, భూముల లావాదేవీలకు సంబంధించి ఏ రికార్డులనైనా ఇవ్వమని అడిగేందుకు... వాటిని పరిశీలించేందుకు అధికారం ఉంటుంది. సిట్‌కు విధి నిర్వహణలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, అధికారులు సహకారం అందించాల్సి ఉంటుంది. సిట్‌ ఒక పోలీసుస్టేషన్‌గా పనిచేసేందుకు వీలుగా సీఆర్‌పీసీ కింద అవసరమైన నోటిఫికేషన్లను సంబంధిత ప్రభుత్వ శాఖలు జారీ చేస్తాయి.

ఇదీ చదవండి :ఎవరి "చేతికో" కొత్త సారథ్యం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details