హైదరాబాద్ నగరాన్ని మహబూబ్నగర్ , కర్నూల్ , అనంతపురం , బెంగళూరు , కడప , తిరుపతి వంటి ప్రధానమైన పట్టణాలకు రైలుతో అనుసంధానం చేయడంలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని చేరింది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా షాద్ నగర్ - గొల్లపల్లి మధ్య డబ్లింగ్ రైలు మార్గం పనులు పూర్తిచేసి సెప్టెంబర్ 16న దమ.రైల్వే ప్రారంభించింది. ఈ పనులు రైల్వే పీఎస్యూ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎస్ఎల్ ) ఆధ్వర్యంలో చేపట్టింది.
మరింత బలోపేతం కోసం..
తెలంగాణలో రైళ్ల నిర్వహణ మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టిన ప్రాజెక్టుల్లో సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. 2015-16లో 85 కి.మీ. నిడివిగల ఈ ప్రాజెక్టు రూ.774 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైంది. సికింద్రాబాద్ - ఉందానగర్ సెక్షన్లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఎమ్ఎమ్టీఎస్ ఫేజ్ -1, 2 ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టడం వల్ల, సెక్షన్లో మిగిలిన ఉందానగర్ - మహబూబ్నగర్ భాగం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
ఇదో మైలురాయి..
ప్రస్తుతం సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ ప్రాజెక్ట్లో భాగంగా షాద్ నగర్- గొల్లపల్లి మధ్య 29 కిమీ నిడివిగల నూతన డబుల్ లైన్ను ప్రారంభించడాన్ని మైలురాయిగా భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆనందం వ్యక్తం చేసింది.