కరోనా మహమ్మారి వ్యాపించేందుకు అవకాశం ఉన్న జాబితాలో వృద్ధులున్నారు. రోజువారీ సంపాదనపై ఆధారపడినవారు మొదలుకొని విదేశాల్లోని బిడ్డలు పంపే సొమ్ములతో జీవితాన్ని సాగించే వయోధికుల వరకు పరిస్థితి ఆవేదనాభరితంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరమవడంతో పిల్లల నుంచి నెలవారీ వచ్చే డబ్బులు సకాలంలో అందట్లేదు. ప్రతి 1000 మంది జనాభాలో 10-20శాతం 50-60 ఏళ్ల పైబడిన వారు ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి.
ఊతమిచ్చేవారు లేక..
గ్రేటర్ పరిధిలో సుమారు 15లక్షల మంది వయోధికులు ఉన్నట్టు అంచనా. వీరిలో అధికశాతం ఆసరా పింఛన్లు, బిడ్డలపై ఆధారపడిన వారు. వృద్ధాప్యంలో ఆదుకోవాల్సిన పిల్లల నిర్లక్ష్యంతో నగరానికి చేరినవారు ఏదో ఒక పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. కరోనా భయంతో ఎక్కువమంది నాలుగు గోడలకే పరిమితమయ్యారు.
బేగంపేటకు చెందిన విజయకుమార్ నాలుగేళ్ల క్రితం పదవీవిరమణ చేశారు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంటున్నారు. లాక్డౌన్తో పనిమనిషి మానేసింది. అప్పటివరకు చేదోడుగా ఉండే ఇరుగు పొరుగు కూడా ముఖం చాటేశారు. మందులు తీసుకొచ్చేవారు లేరు.
మణికొండలో కాయగూరలు విక్రయిస్తూ బతికే వృద్ధ దంపతులు రెండు నెలలుగా ఖాళీగా ఉన్నారు. దాచుకున్న సొమ్ములు ఖర్చయ్యాయి. ఎవరి వద్ద చేయిచాచలేక ఉన్నదాంట్లో సర్దుకుంటున్నారు. వృద్ధులను వెంటాడుతున్న భయాలు వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నాయని న్యూరోసైకియాట్రిస్ట్ హరీష్చంద్రారెడ్డి తెలిపారు. ఒంటరితనం, వైరస్ సోకుతుందనే ఆందోళన అధికశాతం వృద్ధుల్లో కనిపిస్తున్నట్టు విశ్లేషించారు. ఉపాధి దూరమవుతుందనే భయంతో ఓ వృద్ధుడు నీటికుంటలో దూకి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు.