రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సాధారణ పరిశీలకులదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి అన్నారు. సర్కిళ్లు, జోన్ల వారీగా నియమించిన సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఆయన నేడు సమావేశమయ్యారు.
మరింత మెరుగ్గా పర్యవేక్షణ
జీహెచ్ఎంసీ పరిధిలో ఆరుగురు సాధారణ ఎన్నికల పరిశీలకులు జోన్లలో పని మొదలు పెట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు. పర్యవేక్షణ మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఒక్కో జోన్కు ఇద్దరు సాధారణ పరిశీలకులను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు అధికారులు ఐదుసార్లు నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. మొదటిది నామినేషన్ల చివరిరోజు, రెండవది పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందు, మూడవది పోలింగ్ అయిన తరువాత, నాలుగోది ఫలితాలు ప్రకటించిన తర్వాత, ఐదోది పరోక్ష ఎన్నిక పూర్తి అయిన తర్వాత సమర్పించాలని వివరించారు.
పోలింగ్, కౌంటింగ్ రోజు వారు సమర్పించే నివేదికలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. ఆ నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం.. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటన తదితర విషయాలపై చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.