‘‘మీ కాళ్లు మొక్కి చెబుతున్నాం.. మేం ఎస్సీలమేనయ్యా.. కానీ తహసీల్దారు మమ్మల్ని బీసీలుగా ధ్రువీకరించారు’’ అని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కోనుప్పలపాడుకు చెందిన ఓబన్న, రత్నకుమారి.. ఆర్డీవో గుణభూషణ్రెడ్డి కాళ్లపై పడి మొరపెట్టుకున్నారు. మే 15న కోనుప్పలపాడులో ఓబన్న, రత్నకుమారి కుటుంబాన్ని అగ్రవర్ణానికి చెందిన వారు కించపరచటం వల్ల ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కాళ్లు మొక్కి చెబుతున్నాం.. మేం ఎస్సీలమే! - ఏపీ రాష్ట్రం తాజా వార్తలు
ఓ అగ్రవర్ణానికి చెందిన వారు తమ వర్గాన్ని కించపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ బాధితులు. కేసు నమోదు సమయంలో ఎస్సీ సర్టిఫికెట్ కూడా పోలీసులకు సమర్పించారు. కానీ ధ్రువపత్రాలు మారాయి. చివరకు తాము ఎస్సీలమేనయ్యా అని కాళ్ల మీద పడి వేడుకునేంత వరకూ వచ్చింది.
కేసు నమోదు సమయంలో పోలీసుశాఖ అడగ్గా తహసీల్దారు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత నిందితుల తరఫున రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు బాధితులు బీసీ వర్గానికి చెందిన వారని తహసీల్దారు ధ్రువపత్రం జారీ చేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం ఆర్డీవో గుణభూషణ్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆర్డీవో కాళ్లపై పడి వేడుకున్నారు. మరోవైపు ఈ ఘటనలో వీఆర్వోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తహసీల్దారుకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.
ఇవీ చూడండి:సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు